అప్పుడు జాతిపితను చంపిన సిద్ధాంతమే.. ఇప్పుడు విద్వేషాన్ని నింపుతోంది: రాహుల్​ గాంధీ

  • ఇప్పుడు కొందరు కొత్తగా గాంధీ సిద్ధాంతాలను వల్లిస్తున్నారని వ్యాఖ్య
  • గాంధీ సిద్ధాంతాలను చెప్పడం సులువేకానీ ఆచరించడమే కష్టమన్న రాహుల్
  • హింసా రాజకీయాలపై తాము పోరాడుతున్నామని వెల్లడి
ఒకప్పుడు మన జాతిపితను చంపిన సిద్ధాంతమే ఇప్పుడు దేశంలో విద్వేషాన్ని నింపుతోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా కర్ణాటకలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ.. ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించి మాట్లాడారు.

నాడు జాతిపితను చంపిన సిద్ధాంతమే ఇప్పుడు ఎనిమిదేళ్లుగా దేశంలో అసమానత్వం, విభజనవాదాన్ని వ్యాప్తి చేస్తోందని.. కష్టపడి సంపాదించుకున్న మన స్వేచ్ఛను హరిస్తోందని.. ఆరోపించారు.

వల్లించడం సులువే.. ఆచరణే కష్టం
ఇప్పుడు అధికారంలో ఉన్నవారు కొత్తగా గాంధీ సిద్ధాంతాలను వల్లిస్తున్నారని, ఇలా వల్లించడం సులభమేగానీ.. గాంధీజీ అడుగుజాడల్లో నడవడం కష్టమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తాము మొదటి నుంచీ గాంధీ చెప్పిన మార్గంలో నడుస్తున్నామని.. ఆయనను చంపిన సిద్ధాంతంపై పోరాడుతున్నామని పేర్కొన్నారు.

ఇప్పుడన్నీ హింసా రాజకీయాలు, అసత్య ప్రచారాలు కొనసాగుతున్నాయని.. వాటికి వ్యతిరేకంగా గాంధీజీ చెప్పిన సందేశాన్ని భారత్‌ జోడో యాత్రలో ప్రచారం చేస్తున్నామని రాహుల్‌ పేర్కొన్నారు.


More Telugu News

Rahul Gandhi Congress india Gandhiji Political national