NT Ramarao: ఓ పాతాళ భైరవి .. ఓ ఎస్వీ రంగారావు: పరుచూరి గోపాలకృష్ణ

  • తెలుగు ఇండస్ట్రీకి 'పాతాళభైరవి' ఒక వరమన్న పరుచూరి 
  • ఎస్వీఆర్ యాక్టింగ్ మరచిపోలేమని కితాబు 
  • జానపదంలా కనిపించే ఫ్యాక్షన్ కథ ఇదని వెల్లడి 
  • మరోసారి చూడండి అంటూ చెప్పుకొచ్చిన పరుచూరి  
Pathala Bhairavi Movie

తెలుగు సినిమా చరిత్రలో ఆసక్తికరమైన అధ్యాయం 'పాతాళభైరవి'. అలాంటి సినిమాను గురించి 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు."ఎందుకో మొన్న 'పాతాళభైరవి' సినిమా చూడాలనిపించి చూశాను. ఎన్టీఆర్ .. ఎస్వీఆర్ ..  రేలంగి .. పద్మనాభం .. బాలకృష్ణ  .. చిన్న పాత్రలో సావిత్రిగారు .. వాళ్లందరినీ అలా చూస్తుంటే, తెలుగు ఇండస్ట్రీకి ఒక వరం మాదిరిగా ఆ సినిమా వచ్చిందనిపించింది" అని అన్నారు. 

జరగనున్న కథను సీఎస్సార్ గారికి వచ్చిన కలగా ముందే చూపించడం దర్శకుడు చేసిన ధైర్యానికి అద్దం పడుతుంది. తన కుమార్తెను ఎవరో ఎత్తుకు వెళ్లినట్టు .. తోట రాముడు ఆమెను కాపాడినట్టుగా ముందుగానే ఒక షాట్ వేసేశారు. నాకు తెలిసి ఎస్వీఆర్ గారికి అది తొలి సినిమా అనుకుంటాను. కానీ తొలి సినిమా నటుడు మాదిరిగా ఆయన కనిపించరు. కళ్లతోనే ఆయన పలికించిన హావభావాలు చూస్తే భయంవేసింది" అని చెప్పారు.  

మాంత్రికుడు ఏ క్షణంలో హీరోను చంపేస్తాడోనని భయపడుతూనే ప్రేక్షకులు ఈ సినిమాను చూశారు. 'రాజకుమారి లభించునూరా' అంటూ ఎస్వీఆర్ ఆ పాత్రలో చూపిన అభినయాన్ని ఎవరూ ఎప్పటికీ మరిచిపోలేరు. అప్పట్లో 'జై పాతాళ భైరవి' అనే మాట ఎంతో పాప్యులర్ అయింది. పేరుకు జానపదమైనా .. అది ఫ్యాక్షన్ సినిమావంటిదే. ఎన్నేళ్లు గడిచినా మళ్లీ పసిపిల్లాడి మాదిరిగా చూడాలనిపించే సినిమా 'పాతాళ భైరవి' అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News