Andhra Pradesh: ఏపీకి తెలంగాణ ట్రాన్స్‌కో బ‌కాయిల చెల్లింపుల‌పై హైకోర్టు స్టే

  • ఏపీకి రూ.6,995 కోట్ల మేర బ‌కాయి ప‌డ్డ తెలంగాణ‌
  • ట్రాన్స్‌కో బ‌కాయిల‌ను చెల్లించాలంటూ తెలంగాణ‌కు కేంద్రం ఆదేశం
  • తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించిన రాష్ట్ర ప్ర‌భుత్వం
ts high court stay on telangana debt to ap in transco

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య కొన‌సాగుతున్న వివాదాల్లో ఒక‌టైన విద్యుత్ బ‌కాయిల చెల్లింపులో తెలంగాణ‌కు బుధ‌వారం భారీ ఊర‌ట ల‌భించింది. ఏపీకి బ‌కాయిప‌డ్డ ట్రాన్స్‌కో బిల్లుల చెల్లింపుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది.  

తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత తెలంగాణ నుంచి బొగ్గును తీసుకున్న ఏపీ... అందుకు ప్ర‌తిగా విద్యుత్‌ను స‌ర‌ఫ‌రా చేసింది. అయితే కాల‌క్ర‌మేణా బొగ్గు బ‌కాయిలు చెల్లించాలంటూ తెలంగాణ కోర‌గా... త‌మ విద్యుత్‌ను తీసుకున్న కార‌ణంగా ఆ బ‌కాయిల‌ను చెల్లించాలంటూ ఏపీ వాద‌న‌కు దిగింది. ఈ క్ర‌మంలో ఈ వ్య‌వ‌హారం కేంద్రం వ‌ద్ద‌కు వెళ్ల‌గా ఇరు రాష్ట్రాల వాద‌న‌లు విన్న కేంద్రం... తెలంగాణనే ఏపీకి రూ.6,995 కోట్ల విద్యుత్ బ‌కాయి ప‌డిందని తేల్చింది. ఈ బ‌కాయిల‌ను చెల్లించాల‌ని తెలంగాణ‌కు ఆదేశాలు జారీ చేసింది.

ఈ వ్య‌వ‌హారంపై తెలంగాణ స‌ర్కారు తెలంగాణ‌ హైకోర్టును ఆశ్ర‌యించింది. బ‌కాయిల చెల్లింపుల‌ను నిలుపుదల చేయాలంటూ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ పిటిష‌న్‌పై బుధ‌వారం విచార‌ణ జ‌ర‌గ‌గా...తెలంగాణ త‌ర‌ఫున అద‌న‌పు అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ రాంచంద‌ర్ రావు వాద‌న‌లు వినిపించారు. తెలంగాణ వాద‌న‌ల‌తో ఏకీభ‌వించిన హైకోర్టు ఏపీకి చేయాల్సిన విద్యుత్ బ‌కాయిల‌ చెల్లింపుపై స్టే విధించింది.

More Telugu News