Roja: ఆయన నిజంగానే రారాజు: రోజా

  • కృష్ణంరాజుకు నివాళి అర్పించిన రోజా
  • ఆయన మనసు చాలా మంచిదని కితాబు
  • తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంతో ఎంకరేజ్ చేశారని వ్యాఖ్య
Roja pays tributes to Krishnam Raju

సినీ రంగంలో, రాజకీయ రంగంలో కృష్ణంరాజు గారు నిజంగానే రారాజు అని ఏపీ మంత్రి, సినీ నటి రోజా అన్నారు. పేరులో రెబల్ స్టార్ ఉన్నప్పటికీ ఆయన మనసు ఎంత మంచిదో, ఆయన ఎంత మంచి మనిషో ఎవరూ మర్చిపోలేరని చెప్పారు. సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరావు, కృష్ణంరాజు, శోభన్ బాబు తదితరులు పెద్ద దిక్కుగా ఉంటూ ఇండస్ట్రీని ఎలా ముందుకు నడిపించారో మనందరం కళ్లారా చూశామని అన్నారు. తాను ఆయనతో కేవలం ఒక్క సినిమా మాత్రమే చేసినప్పటికీ... తాను ఎక్కడ కనిపించినా ఎంతో ఆప్యాయంగా పలకరించే వారని చెప్పారు. 

తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనను ఎంతో ఎంకరేజ్ చేశారని తెలిపారు. ఈ రోజు ఆయన లేరు అనే వార్త విని చాలా బాధ పడ్డానని చెప్పారు. ఆయన మరణం సినీ, రాజకీయ రంగాలకు తీరని లోటు అని అన్నారు. ప్రకృతిని చాలా బలంగా నమ్మిన వ్యక్తి అని... ఆయుర్వేదం అంటే ఆయనకు చాలా ఇష్టమని చెప్పారు. అడిగిన వారందరికీ సాయం చేసే గొప్ప మనిషి అని కొనియాడారు. కృష్ణంరాజు గారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని... ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. కృష్ణంరాజు భౌతికకాయానికి రోజా ఈరోజు నివాళి అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

More Telugu News