Prasanth Kishore: నితీశ్ కుమార్ ను ఫెవికాల్ తన బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవాలి: ప్రశాంత్ కిశోర్ సెటైర్

  • ఏ కూటమి వచ్చినా సీఎం పోస్టు నితీశ్ దేనన్న ప్రశాంత్ కిశోర్
  • కుర్చీకి అతుక్కుపోతున్నారని వ్యంగ్యం
  • కుర్చీకి, నితీశ్ కు మధ్య లింకు తెగడంలేదని వ్యాఖ్యలు
Prasanth Kishore satires on Nitish Kumar

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీహార్ లో అనేక కూటములు వస్తున్నాయి, పోతున్నాయి గానీ... ఒక లింకు మాత్రం తెగిపోవడంలేదని అన్నారు. అది... సీఎం కుర్చీకి నితీశ్ కుమార్ కు మధ్య ఉన్న లింకేనని వెల్లడించారు. 

అనేక పొత్తులు భగ్నమవుతున్నా, సీఎం కుర్చీకి నితీశ్ కుమార్ కు మధ్య ఉన్న బంధం మాత్రం అవిచ్ఛిన్నంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఏ కూటమి వచ్చినా సీఎం కుర్చీకి నితీశ్ కుమార్ మాత్రమే అతుక్కుపోతున్నారని, ఫెవికాల్ సంస్థ నితీశ్ కుమార్ ను తన బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవాలని సెటైర్ వేశారు. 

గతంలో ప్రశాంత్ కిశోర్ కూడా జేడీయూ పార్టీ నేత అన్న విషయం తెలిసిందే. పలు పరిణామాల నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ జేడీయూ నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. ప్రశాంత్ కిశోర్ ను జేడీయూలోకి తీసుకువచ్చిన నితీశ్ కుమార్ ఎంతో ప్రోత్సహించారు. కొద్దికాలంలోనే ప్రశాంత్ కిశోర్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎదిగారు. కానీ సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ విధానాలపై పార్టీ వైఖరితో ప్రశాంత్ కిశోర్ విభేదించారు. దాంతో ఆయనను పార్టీ నుంచి తప్పించారు. 

ఇటీవల బీహార్ లో బీజేపీకి గుడ్ బై చెప్పి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి నితీశ్ కుమార్, ప్రశాంత్ కిశోర్ మధ్య పరస్పర విమర్శల దాడి కొనసాగుతోంది.

More Telugu News