Andhra Pradesh: అమ‌రావ‌తి దేవ‌త‌ల రాజ‌ధాని కాదు... దెయ్యాల రాజ‌ధాని: ఏపీ మంత్రి అమ‌ర్‌నాథ్‌

  • 3 రాజ‌ధానుల‌పై కొత్త బిల్లు తీసుకొస్తామ‌న్న అమ‌ర్‌నాథ్
  • వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లోనే ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డి
  • చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు వింటే కులీకుతుబ్‌షా ఉరేసుకుంటార‌ని సెటైర్‌
ap minister gudivada amarnath viral comments on amaravati

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై ఆ రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ శుక్ర‌వారం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అమ‌రావ‌తి దేవ‌త‌ల రాజ‌ధాని కాదు అన్న ఆయ‌న... అమ‌రావ‌తిని దెయ్యాల రాజ‌ధానిగా అభివ‌ర్ణించారు. రాష్ట్రానికి మూడు రాజ‌ధానుల ఏర్పాటుకు సంబంధించి కొత్త బిల్లుతో వ‌స్తామ‌ని ఆయ‌న చెప్పారు. అమ‌రావ‌తి నిర్మాణానికి భూములు ఇచ్చిన రాజ‌ధాని రైతులు నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన మ‌హాపాద‌యాత్ర‌కు హైకోర్టు అనుమ‌తి ఇచ్చిన నేప‌థ్యంలో ఆ తీర్పును స్వాగ‌తిస్తూ ప‌లువురు వ్యాఖ్య‌లు చేసిన నేపథ్యంలో వాటిపై స్పందించేందుకు మీడియా ముందుకు వ‌చ్చిన సంద‌ర్భంగా శుక్ర‌వారం అమ‌ర్‌నాథ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

త్వ‌ర‌లో జ‌రిగే అసెంబ్లీ స‌మావేశాల్లోనే మూడు రాజ‌ధానుల బిల్లును ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని కూడా అమ‌ర్‌నాథ్ చెప్పారు. ఇదివ‌ర‌కు ప్ర‌తిపాదించిన బిల్లుపై ప‌లు అభ్యంత‌రాలు వ్య‌క్త‌మైన నేప‌థ్యంలో కొత్త బిల్లును తీసుకువ‌స్తున్న‌ట్లుగా ఆయ‌న చెప్పారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడిపైనా అమ‌ర్‌నాథ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. గాడిద‌కు కొమ్ములు వ‌చ్చినా, ముస‌లోడికి పిచ్చి వ‌చ్చినా భ‌రించ‌డం క‌ష్ట‌మ‌న్న అమ‌ర్‌నాథ్‌... ఇప్పుడు చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు చూస్తున్నా అదే త‌ర‌హా ప‌రిస్థితి గుర్తుకు వ‌స్తోంద‌న్నారు. హైద‌రాబాద్‌ను అభివృద్ధి చేసింది తానేనని చెప్పుకుంటున్న చంద్ర‌బాబు మాట‌లు వింటే కులీ కుతుబ్‌షా ఉరేసుకుంటార‌ని ఆయ‌న సెటైర్‌ వేశారు.

More Telugu News