Hyderabad: ఐఐటీ హైదరాబాద్ కు చెందిన మరో విద్యార్థి ఆత్మహత్య

  • సంగారెడ్డిలోని ఒక లాడ్జ్ పై నుంచి దూకి ఆత్మహత్య
  • మృతుడు రాజస్థాన్ జోధ్ పూర్ కు చెందిన వ్యక్తిగా గుర్తింపు
  • ఆగస్ట్ 31న ఆత్మహత్యకు పాల్పడిన మరో విద్యార్థి
IIT Hyderabad student commits suicide

ఐఐటీ హైదరాబాద్ కు చెందిన మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. సంగారెడ్డిలోని ఒక లాడ్జ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ నగరానికి చెందిన మేఘా కపూర్ గా గుర్తించారు. మూడు నెలల క్రితమే ఐఐటీలో మేఘా కపూర్ బీటెక్ లో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. బీటెక్ పూర్తయినప్పటి నుంచి సంగారెడ్డిలోని ఆధ్యా లాడ్జిలో ఒక రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. మేఘా కపూర్ మృత దేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 

వారం వ్యవధిలో ఐఐటీ హైదరాబాద్ కు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఇది రెండో సారి. ఆగస్ట్ 31న ఐఐటీలో ఎంటెక్ చదువుతున్న రాహుల్ అనే విద్యార్థి ఆత్యహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ లోని తన గదిలో నైలాన్ తాడుతో ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ ఐఐటీలో 2019 నుంచి ఆరుగురు విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. మరోవైపు, ఐఐటీ క్యాంపస్ లో వరుస ఆత్మహత్యలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

More Telugu News