Andhra Pradesh: డాక్ట‌ర్ నోరి ద‌త్తాత్రేయుడితో ఏపీ వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జని భేటీ

  • కేన్స‌ర్ ఆసుప‌త్రుల‌పై గ‌తంలోనే జ‌గ‌న్‌తో ద‌త్తాత్రేయుడి భేటీ
  • తాజాగా జ‌గ‌న్ ప్ర‌తిపాద‌న‌ల‌పై చ‌ర్చించిన ర‌జని
  • గ్రామ స్థాయిలోనే కేన్స‌ర్ నిర్ధార‌ణ‌కు చ‌ర్య‌ల‌పై ప్ర‌స్తావ‌న‌
ap minister vidadala rajini meets Dr Nori Dattatreya

కేన్స‌ర్ చికిత్సలో ప్ర‌పంచంలోనే ప్ర‌ఖ్యాతి గాంచిన వైద్యుడిగా పేరొందిన డాక్ట‌ర్ నోరి ద‌త్తాత్రేయుడిని సోమ‌వారం ఏపీ వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జని భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా కేన్స‌ర్ చికిత్స‌ల‌కు సంబంధించి గ‌తంలో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో ద‌త్తాత్రేయుడి భేటీ నాటి అంశాల‌పై వారిద్ద‌రూ చ‌ర్చించారు. 

రాష్ట్ర ప్ర‌జ‌లు కేన్సర్ చికిత్స‌ల కోసం ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా ఏపీలోని విశాఖ‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తిల్లో అత్యాధునిక వ‌స‌తుల‌తో కూడిన కేన్స‌ర్ ఆసుప‌త్రుల నిర్మాణానికి ద‌త్తాత్రేయుడికి జ‌గ‌న్ ప్ర‌తిపాదించిన సంగ‌తి తెలిసిందే. 

సోమ‌వారం నాటి భేటీ సంద‌ర్భంగా ద‌త్తాత్రేయుడితో ఆరోగ్య మంత్రి ర‌జని రాష్ట్రంలో కేన్స‌ర్ చికిత్స‌లపై చ‌ర్చించారు. కేన్స‌ర్ చికిత్స‌ల కంటే కూడా నివార‌ణపై దృష్టి పెట్టే దిశ‌గా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ర‌జని ప్ర‌స్తావించారు. ఇందులో భాగంగా గ్రామాల్లో నూత‌నంగా ఏర్పాటు చేసిన విలేజ్ క్లినిక్‌ల‌ను వినియోగించుకునే అంశంపై ఆమె ద‌త్తాత్రేయుడితో చ‌ర్చించారు. గ్రామ స్థాయిలోనే కేన్స‌ర్ రోగాన్ని గుర్తించేలా కూడా ఏర్పాట్లు చేసే దిశ‌గా వారిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింది.

More Telugu News