Yanamala: బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలి: కేంద్రానికి యనమల లేఖ

  • కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు యనమల లేఖ
  • కాకినాడలో ఏర్పాటు చేయబోయే డ్రగ్ పార్క్ వల్ల పర్యావరణానికి ముప్పు అంటూ వివరణ 
  • రైతులు, మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని వ్యాఖ్య
Yanamala demands to withdraw bulk drug park in Kakinada

కాకినాడలో ఏర్పాటు చేయబోతున్న బల్క్ డ్రగ్ పార్క్ వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు పొంచి ఉందంటూ కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో ఆయన కోరారు. ఈ లేఖ కాపీలను జాతీయ హరిత ట్రైబ్యునల్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు. 

ఇక్కడ సెజ్ ఏర్పాటు కోసం రైతుల నుంచి అప్పటి వైఎస్ ప్రభుత్వం 8,500 ఎకరాల భూమిని సేకరించిందని.. ఇక్కడ ఏర్పాటు చేసే పరిశ్రమ వల్ల మత్స్యకారుల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పారని యనమల తెలిపారు. 

అయితే, అందుకు విరుద్ధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ అరబిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కు ఫార్మా పార్క్ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. ఫార్మా పార్క్ ఏర్పాటు చేస్తే.. అది నేల, నీరు, వాయు, సముద్రం కలుషితమై రైతులు, మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. ఫార్మా పార్క్ ను  వ్యతిరేకిస్తూ రైతులు, మత్స్యకారులు ఇప్పటికే ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు.

More Telugu News