Sonali Phogat: బీజేపీ నేత సోనాలీ ఫోగాట్ కు సింథటిక్ డ్రగ్ ఇచ్చారు: గోవా పోలీసులు

  • గోవాలో మరణించిన సోనాలీ ఫోగాట్
  • తొలుత గుండెపోటుగా భావించిన పోలీసులు
  • పోస్టుమార్టం రిపోర్టుతో హత్య కేసు నమోదు
  • సోనాలీ సహాయకుల అరెస్ట్
Goa police told accused gave synthetic drug to Sonali Phogat

టిక్ టాక్ స్టార్, బీజేపీ నేత సోనాలీ ఫోగాట్ గోవాలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. తొలుత గుండెపోటుగా భావించిన పోలీసులు, పోస్టుమార్టం నివేదిక అనంతరం హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో సోనాలీ ఫోగాట్ సహాయకులు సుధీర్ సాంగ్వాన్, సుఖ్వీందర్ వసీలను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. 

నిందితులు సుధీర్ సాంగ్వాన్, సుఖ్వీందర్ వసీ... సోనాలీ ఫోగాట్ కు కర్లీస్ క్లబ్ లో ఓ సింథటిక్ డ్రగ్ ఇచ్చారని గోవా ఐజీ ఓంవీర్ సింగ్ బిష్ణోయ్ వెల్లడించారు. సింథటిక్ డ్రగ్ అని చెప్పారు కానీ, ఆ పదార్థం పేరు ఏమిటన్నది వెల్లడించలేదని తెలిపారు. ఆ పదార్థాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. 

"సోనాలీ ఫోగాట్ తో సుధీర్ సాంగ్వాన్, సుఖ్విందర్ వసీ కర్లీస్ క్లబ్ లో పార్టీ చేసుకున్నారు. వీరిద్దరిలో ఒకరు సోనాలీ ఫోగాట్ తో బలవంతంగా ఓ డ్రింక్ తాగించినట్టు సీసీటీవీ ఫుటేజి ద్వారా వెల్లడైంది. ఈ వీడియో ఆధారంగా సుధీర్, సుఖ్వీందర్ ను గట్టిగా ప్రశ్నించాం. దాంతో, ఆ డ్రింక్ లో ఓ రసాయనం కలిపినట్టు అంగీకరించారు. ఆమె అపస్మారక స్థితిలోకి జారుకోగా, వారు ఆమెను టాయిలెట్లోకి తీసుకెళ్లారు. అక్కడే వారు రెండు గంటల పాటు ఉన్నారు. టాయిలెట్లో ఏం జరిగిందన్నది వారు బయటపెట్టడంలేదు. విచారణ సాగే కొద్దీ వివరాలు బయటికి వస్తాయని భావిస్తున్నాం" అని వివరించారు.

More Telugu News