Khammam District: విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ప్రధానోపాధ్యాయుడు.. చితకబాదిన తల్లిదండ్రులు

  • ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం జడ్పీ పాఠశాలలో ఘటన
  • హెచ్ఎం కారులో స్కూలుకు వస్తుండగా అడ్డుకున్న గ్రామస్థులు
  • చితకబాది సర్పంచ్ వద్దకు తీసుకెళ్లిన గ్రామస్థులు
  • డిప్యుటేషన్‌పై వెళ్తానంటే శాంతించిన వైనం
  • విచారణకు ఆదేశించిన డీఈవో
Wyra School HM attacked by villagers for misbehaving with girl students

విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ప్రధానోపాధ్యాయుడిని తల్లిదండ్రులు చితకబాదారు. ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురంలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులను ఈ నెల 18న ‘గాంధీ’ సినిమాకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా స్కూలు ప్రధానోపాధ్యాయుడు సలాది రామారావు పలువురు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. తాను సగం తాగిన కూల్‌డ్రింక్‌ను తాగాలంటూ బలవంతం చేశాడు. విషయాన్ని విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పారు. చాలా రోజులుగా ఆయన తమను ఇబ్బంది పెడుతున్నాడని, మాట వినడం లేదని కొడుతూ అసభ్యంగా తాకుతున్నాడని చెప్పారు. 

రామారావు నిన్న కారులో స్కూలుకు వస్తుండగా అడ్డుకున్న గ్రామస్థులు ఆయనను కిందికి లాగి చితకబాదారు. సర్పంచ్ ఇంటికి తీసుకెళ్లి ఓ గదిలో నిర్బంధించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని ప్రధానోపాధ్యాయుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. అయితే, గ్రామస్థులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరికి హెచ్ఎంను ఎలాగోలా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు అక్కడికి కూడా చేరుకున్నారు. 

రామారావు గ్రామంలో పనిచేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. దీంతో డిప్యుటేషన్‌పై  వేరే ప్రాంతానికి వెళ్తానని, లేదంటే సెలవులో ఉంటానని రామారావు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు శాంతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపించేందుకు గొల్లపూడి ప్రధానోపాధ్యాయుడిని నియమిస్తూ డీఈవో యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారు.

More Telugu News