Varavara Rao: వరవరరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట.. శాశ్వత బెయిల్‌ మంజూరు

  • బెయిల్ పై ఉన్న పరిమితిని ఎత్తివేసిన సుప్రీంకోర్టు
  • ఇప్పటికే రెండున్నరేళ్లు జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారన్న ధర్మాసనం
  • గ్రేటర్ ముంబై దాటి వెళ్లకూడదని కండిషన్
Supreme Court grants permanent bail to Varavara Rao

విప్లవ రచయిత వరవరరావుకు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. ఆయన బెయిల్ పై ఉన్న కాల పరిమితిని ఎత్తివేసింది. షరతులతో కూడిన శాశ్వత మెడికల్ బెయిల్ ను మంజూరు చేసింది. గ్రేటర్ ముంబై దాటి వెళ్లకూడదని ఆంక్షలు విధించింది. కోర్టు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదని చెప్పింది. కేసు దర్యాప్తును ప్రభావితం చేయకూడదని, సాక్షులతో సంప్రదింపులు జరపకూడదని తెలిపింది. 

82 ఏళ్ల వరవరరావు ఇప్పటికే రెండున్నరేళ్లు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని సుప్రీంకోర్టు తెలిపింది. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న తనకు శాశ్వత బెయిల్ ఇవ్వాలని వరవరరావు పిటిషన్ పెట్టుకున్నారు. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ఆరు నెలల బెయిల్ ను పర్మినెంట్ బెయిల్ గా మార్చింది. ఈ పిటిషన్ ను జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ సుధాంశు దులియాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. 

వరవరరావు కేసు వివరాల్లోకి వెళ్తే... కోరేగావ్ అల్లర్ల కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్లాన్ చేశారనే ఆరోపణలతో వరవరరావు సహా 17 మందిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. వీరిలో సామాజిక కార్యకర్తలు, మేధావులు ఉన్నారు. 2018 ఆగస్టు 28న వరవరరావును అరెస్ట్ చేశారు.

More Telugu News