Bollywood: అక్షయ్ కుమార్​ తో మళ్లీ జోడీ కట్టిన పరిణీతి

  • లండన్ లో జరుగుతున్న షూటింగ్ లో జాయిన్ అయిన యువ నటి
  • గతంలో ఇద్దరూ కలిసి చేసిన ‘కేసరి’ సూపర్ హిట్
  • మరో హిట్ గ్యారంటీ అంటున్న తాజా చిత్ర బృందం 
Akshay Kumar and Parineeti Chopra reunite for a new project

ప్రియాంక చోప్రా కజిన్ గా బాలీవుడ్ లో అడుగు పెట్టిన పరిణీతి చోప్రా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ‘లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్’తో ఎంట్రీ ఇచ్చిన పరిణీతి కెరీర్ ప్రారంభంలో యూత్‌, రొమాంటిక్  సినిమాల్లోనే ఎక్కువగా నటించింది. ఆ తర్వాత మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాల వైపు మళ్లింది. ‘ద గాళ్ ఆన్‌ ద ట్రైన్’, ‘సైనా’ చిత్రాల్లో తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం మరో మూడు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తుందామె. తాజాగా పరిణీతి మరో భారీ ఆఫర్ సొంతం చేసుకుంది.

ప్రస్తుతం బాలీవుడ్ ను ఏలుతున్న స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో రెండోసారి జోడీ కట్టింది. తను హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు పరిణీతి హీరోయిన్ గా ఎంపికైంది. ఈ చిత్రానికి టినూ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. పూజా ఎంటర్‌‌టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ మధ్యే అధికారికంగా ప్రకటించారు. ఇంకా పేరు పెట్టలేదు. ఓ కోల్‌మైన్ ఆపరేషన్‌లో ఎంతోమందిని కాపాడిన జస్వంత్ గిల్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. 

జస్వంత్ పాత్రలో అక్షయ్ నటిస్తున్నాడు. అతనికి జోడీగా పరిణీతి కనిపించబోతోంది. లండన్ లో జరుగుతున్న షూటింగ్ లో పరిణీతి కూడా జాయిన్ అయ్యింది. అక్షయ్, పరిణీతి గతంలో ‘కేసరి’ చిత్రంలో నటించారు. ఆ సినిమా సూపర్‌‌ హిట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ హిట్ పెయిర్ మరో విజయం సాధిస్తుందని ఆశిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.

More Telugu News