srilanka: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన రణిల్ విక్రమసింఘే

  • భారీ మెజారిటీతో గెలుపు
  • 221 ఓట్లలో రణిల్ విక్రమసింఘేకు 134 ఓట్లు
  • ఆరుసార్లు ప్రధానిగా పని చేసిన రణిల్
Ranil Wickremesinghe elected as New President of Sri Lanka

శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే ఎన్నికయ్యారు. గొటబాయ రాజపక్స స్థానంలో కొత్త అధ్యక్షుడిగా రణిల్ ను శ్రీలంక పార్లమెంటు ఎన్నుకుంది. 221 ఓట్లకు గాను విక్రమసింఘేకు మొత్తం 134 ఓట్లు వచ్చాయి. అయన ప్రధాన ప్రత్యర్థి దులాస్ అలహప్పెరుమకు 82 ఓట్లు లభించగా.. లెఫ్టిస్ట్ అనురా దిసానాయకు కేవలం మూడు ఓట్లు మాత్రమే లభించాయి. మొదటి ప్రాధాన్యత ఓటింగ్ లోనే రణిల్ కు పూర్తి మెజారిటీ లభించింది. ఎన్నికల్లో మొత్తం 223 ఓట్లు పోలవగా.. ఇద్దరు ఎంపీల ఓట్లు చెల్లుబాటు కాలేదు.

 విక్రమసింఘే ఆరుసార్లు శ్రీలంక  ప్రధానమంత్రిగా పని చేశారు. సంక్షోభంలో చిక్కుకున్న దేశం నుంచి పారిపోయి వారం కిందట అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గొటబాయ స్థానంలో ఆయన ఇప్పటివరకు తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యహరించారు. ఇప్పుడు ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన నూతన అధ్యక్షుడిగా పూర్తి స్థాయి బాధ్యతలు అందుకోనున్నారు. ఎన్నిక తర్వాత మాట్లాడిన రణిల్ దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, తమ ముందు పెద్ద సవాళ్లు ఉన్నాయని అన్నారు.

More Telugu News