జగన్ ఎన్ని గొప్పలు చెప్పుకున్నా.. ఆ క్రెడిట్ చంద్రబాబుదే: సోమిరెడ్డి
- సూక్ష్మసేద్యంలో ఏపీ అగ్రగామిగా నిలవడం వైసీపీ గొప్పదనంగా సాక్షిలో రాసుకున్నారన్న సోమిరెడ్డి
- చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహకాలతోనే ఇది సాధ్యమయిందని వ్యాఖ్య
- మైక్రో ఇరిగేషన్ కు వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కేటాయించిన పాపాన పోలేదని విమర్శ
వైసీపీ మూడేళ్ల పాలనలో మైక్రో ఇరిగేషన్ను పూర్తిగా మూలన పెట్టేశారని సోమిరెడ్డి విమర్శించారు. మైక్రో ఇరిగేషన్ కు ఒక్క రూపాయి కేటాయించిన పాపాన పోలేదని... లేదంటే సాగు విస్తీర్ణం ఇంకా పెరిగేదని అన్నారు. 2002లో కుప్పంలో ఇజ్రాయిల్ టెక్నాలజీ మైక్రో ఇరిగేషన్ను ప్రారంభించడం ద్వారా దేశానికి ఈ తరహా సేద్యాన్ని పరిచయం చేసిందే చంద్రబాబు అని చెప్పారు. నవ్యాంధ్రప్రదేశ్ కు చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఈ రంగాన్ని మరింత ప్రోత్సహించారని తెలిపారు. ఏడాదికి రూ. 1,200 కోట్ల వరకు ఖర్చు పెట్టి 2017-18లో మైక్రో ఇరిగేషన్ లో ఏపీని జాతీయ స్థాయిలో అగ్ర స్థానంలో నిలిపారని చెప్పారు. చంద్రబాబు ముందుచూపు వల్లే ఈరోజు 51 శాతం సాగు విస్తీర్ణంతో మరోసారి ఏపీ ముందు నిలిచిందని అన్నారు.