Wife: జీన్స్ వేసుకుని జాతరకు వెళ్లిందని భార్యపై కోప్పడిన భర్త... కత్తితో పొడిచి చంపేసిన భార్య

  • ఝార్ఖండ్ లోని జోర్బితా గ్రామంలో ఘటన
  • జీన్స్ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ
  • క్షణికావేశంలో దారుణం
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
Wife kills husband after spat about wearing jeans

ఝార్ఖండ్ లో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. భార్య జీన్స్ వేసుకుందని భర్త కోప్పడగా, భార్య క్షణికావేశంలో భర్తను కత్తితో పొడిచి చంపేసింది. ఈ ఘటన జమ్తారా పోలీస్ స్టేషన్ పరిధిలోని జోర్బితా గ్రామంలో జరిగింది. ఆమె పేరు పుష్పా హెంబ్రోమ్. తమ గ్రామానికి సమీపంలోని గోపాల్ పూర్ లో జరిగే జాతరకు జీన్స్ ధరించి వెళ్లింది. తిరిగి ఇంటికి రాగానే, జీన్స్ వేసుకుని ఎందుకు వెళ్లావంటూ భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య ఘర్షణ ఏర్పడింది. దాంతో పుష్పా హెంబ్రోమ్ ఓ కత్తితో భర్తను పొడిచింది. తీవ్ర గాయాలపాలైన అతడిని ఇతర కుటుంబ సభ్యులు ధన్ బాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. దీనిపై మృతుడి తండ్రి కర్ణేశ్వర్ తుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కొడుకును కోడలే చంపిందని పోలీసులకు వెల్లడించాడు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News