Sri Lanka: అధ్యక్ష ఎన్నికలకు ముందు.. శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటన

  • నేటి నుంచే అమల్లోకి ఎమర్జెన్సీ 
  • అధ్యక్ష ఎన్నికలకు రేపే నామినేషన్ల స్వీకరణ
  • ఎల్లుండే అధ్యక్షుడి ఎన్నిక
  • రేసులో ప్రధాన ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస
Emergency Declared In Sri Lanka Ahead Of Presidential Election

శ్రీలంకలో మరోమారు అత్యవసర పరిస్థితి (Emergency) ప్రకటించారు. గొటబాయ రాజపక్స అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఎల్లుండి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఆందోళనలు, హింస తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా అత్యవసర పరిస్థితి ప్రకటించారు. నేటి నుంచే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటిస్తూ తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే గెజిట్ విడుదల చేశారు. 

ప్రజా భద్రత, శాంతిభద్రతలు, ప్రజాసేవల నిర్వహణ ప్రయోజనాల దృష్ట్యా దేశంలో పబ్లిక్ ఎమర్జెన్సీ ప్రకటించినట్టు గెజిట్ నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. కాగా, అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రేపు నామినేషన్లు స్వీకరిస్తారు. 20న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని శ్రీలంక పార్లమెంటు ప్రకటించింది. ప్రధాన ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. నిజం గెలుస్తుందన్న నమ్మకం ఉండడం వల్లే అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్టు ఇటీవల ఆయన పేర్కొన్నారు.

More Telugu News