Congress: వాగు మధ్యలో ఆగిపోయిన పడవ.. ప్రమాదం నుంచి బయట పడ్డ ఎమ్మెల్యే సీతక్క

  • వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంచుతుండగా  ఘటన
  • పెట్రోలు అయిపోవడంతో మధ్యలో ఆగి ఒకవైపునకు కొట్టుకెళ్లిన పడవ
  • చెట్టును ఢీకొట్టి ఆగిన పడవ నుంచి సురక్షితంగా బయటకు వచ్చిన సీతక్క
Congress MLA Sethakka Narrowly escaped from boat accident

కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు ప్రమాదం తప్పింది. ములుగు జిల్లా ఏటూరునాగరం మండలం ఎలిశెట్టిపల్లి ఏజెన్సీ ప్రాంతంలో శనివారం వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసేందుకు సీతక్క వెళ్లారు. తిరుగుప్రయాణంలో.. ఎలిశెట్టిపల్లి వాగులో ఆమె ప్రయాణిస్తున్న పడవ పెట్రోల్ అయిపోవడంతో మధ్యలోనే ఆగిపోయింది. 

అదే సమయంలో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో పడవ వాగుకు ఒకవైపునకు  కొట్టుకుపోయింది. ఒడ్డున ఉన్న ఓ చెట్టును ఢీకొని.. అక్కడే ఆగిపోయింది. ఈ ఘటన నుంచి సీతక్క క్షేమంగా బయటపడి ఒడ్డుకు చేరుకోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. 

తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి నది పరివాహక ప్రాంతాలు నీటమునిగాయి. ఏటూరునాగారం ఏజెన్సీలోనూ చాలా గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో  ఎమ్మెల్యే సీతక్క పడవల సాయంతో గ్రామాలకు వెళ్లి.. నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. బియ్యం, ఉప్పు, పప్పు, నూనె, కూరగాయలను అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే  పడవ ఆగిపోయింది.

More Telugu News