Andhra Pradesh: ఏపీలో మునిసిపల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి హైపవర్ కమిటీ ఏర్పాటు

- సమస్యల పరిష్కారం కోసం మునిసిపల్ ఉద్యోగుల నిరసనలు
- వేగంగా స్పందించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
- ముగ్గురు మంత్రులు, సీఎస్తో హైపవర్ కమిటీ ఏర్పాటు
- ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించిన కమిటీ
ఏపీలో మునిసిపల్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం నుంచి నిరసనలకు దిగారు. ఈ క్రమంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఓ హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మునిసిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్తో పాటు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మలు ఉన్నారు.
మునిసిపల్ కార్మికుల నిరసనలపై వేగంగా స్పందించిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం... తక్షణమే రంగంలోకి దిగిపోవాలని కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చర్చలకు రావాలంటూ మునిసిపల్ ఉద్యోగాల సంఘాల నేతలకు కమిటీ నుంచి ఆహ్వానం అందింది.