Team India: మూడో టీ20లో టీమిండియా ముందు భారీ టార్గెట్... ఆరంభంలోనే పంత్ అవుట్

  • నాటింగ్ హామ్ లో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు
  • మలాన్ 77, లివింగ్ స్టోన్ 42 పరుగులు
  • మెరుపు ఇన్నింగ్స్ ఆడిన బ్రూక్, జోర్డాన్
Huge target to Team India in third T20

నామమాత్రమైన చివరి టీ20 మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ రెచ్చిపోయారు. డేవిడ్ మలాన్ (39 బంతుల్లో 77 రన్స్), లియామ్ లివింగ్ స్టోన్ (29 బంతుల్లో 42 పరుగులు) ధాటిగా ఆడటంతో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు చేసింది. మలాన్ స్కోరులో 6 ఫోర్లు, 5 భారీ సిక్సులు ఉన్నాయి. లివింగ్ స్టోన్ 4 సిక్సులు బాదాడు. ఆఖర్లో హ్యారీ బ్రూక్ ( 9 బంతుల్లో 19 రన్స్; 3 ఫోర్లు), క్రిస్ జోర్డాన్ (3 బంతుల్లో 11 రన్స్; 1 ఫోర్, 1 సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.

అంతకుముందు, టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకోగా, ఓపెనర్లు జాసన్ రాయ్ (27), జోస్ బట్లర్ (18) తొలి వికెట్ కు 31 పరుగులు జోడించారు. బట్లర్ ను అవేష్ ఖాన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత జాసన్ రాయ్ ని ఉమ్రాన్ మాలిక్ అవుట్ చేశాడు. అయితే, మలాన్, లివింగ్ స్టోన్ జోడీ టీమిండియా బౌలింగ్ ను ఊచకోత కోసింది. ముఖ్యంగా, మలాన్ విజృంభణకు టీమిండియా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 

సాల్ట్ 8 పరుగులు చేయగా, మొయిన్ అలీ (0) డకౌట్ అయ్యాడు. టీమిండియా బౌలర్లలో రవి బిష్ణోయ్ 2, హర్షల్ పటేల్ 2, అవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్ 1 వికెట్ తీశారు. అనంతరం, 216 పరుగుల భారీ లక్ష్యఛేదనలో టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 1 పరుగు చేసిన రిషబ్ పంత్... టాప్లే బౌలింగ్ లో బట్లర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 2 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 3 పరుగులు. క్రీజులో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు.

More Telugu News