CM KCR: కట్టప్పా.. కాకరకాయా..? బీజేపీ దేశాన్ని జలగలా పట్టుకుంది: సీఎం కేసీఆర్ ఫైర్

  • హైదరాబాద్ లో వర్షాలపై ప్రెస్ మీట్ సందర్భంగా బీజేపీ, మోదీపై మండిపాటు
  • టీఆర్ఎస్ అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా మోదీ, బీజేపీ నేతలు సమాధానం చెప్పలేదు
  • దేశంలో మోదీ ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని అయినా ఉందా?
  • బీజేపీ విధానాల వల్ల దేశం పరువు పోతోందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు
CM kcr fires on PM Modi and Bjp

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పోవాలని, బీజేపీయేతర ప్రభుత్వం రావాలని సీఎం కేసీఆర్ మరోసారి వ్యాఖ్యానించారు. తెలంగాణ స్థాయిలో కేంద్రం పనిచేస్తే దేశం బాగుపడుతుందని పేర్కొన్నారు.  దేశాన్ని బీజేపీ ఒక జలగలా పట్టి పీడిస్తోందని మండిపడ్డారు. ఆదివారం ప్రగతిభవన్‌ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ అవివేక, అసమర్థ పాలన కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. కేంద్రంలో దద్దమ్మ ప్రభుత్వం ఉండటం వల్ల తెలంగాణ ప్రభుత్వం రూ.3లక్షల కోట్లు నష్టపోయిందని పేర్కొన్నారు. 

మోదీ మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదేం?
‘‘ఇటీవల హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టుకున్నారు. నిజానికి గతంలో సాధించిన విజయాలు, చేయబోయే కార్యక్రమాలపై సందేశం ఇవ్వాలి. కానీ ప్రధాన మంత్రి ఏం మాట్లాడారో దేవుడికే తెలుసు. ప్రధాని మోదీని నేను కొన్ని ప్రశ్నలు అడిగాను. టీఆర్ఎస్  అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా మోదీ, కేంద్ర మంత్రులు సమాధానం చెప్పలేదు. అది డొల్లతనాన్ని బయటపెడుతోంది. తెలంగాణకు ఎలాంటి హామీలు ఇవ్వలేదు.” అని కేసీఆర్ విమర్శించారు.

రూపాయి విలువ పడిపోతుంటే ఏం చేస్తున్నారు?
‘‘ప్రధాని మోదీ గతంలో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రూపాయి విలువ పతనమైందని గొంతు చించుకున్నారు. ఇప్పుడు రూపాయి విలువ ఎందుకు పడిపోతోందో చెప్పాలి. అప్పట్లో మోదీ అడిగినదాన్నే ఇప్పుడు మేమూ అడుగుతున్నాం. బీజేపీ అసమర్థ పాలన వల్లే దేశంలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ డాలర్ తో రూ.80కి పడిపోయింది. అసలు దేశానికి మోదీ చేసిన మంచి పని ఒక్కటైనా ఉందా? సాగునీరు ఇవ్వలేరు, తాగునీరు ఇవ్వడం చేతకాదు. తెలంగాణలో తప్ప దేశమంతా తప్పుడు విద్యుత్ పాలసీని తీసుకొచ్చారు. దేశ రాజధానిలో కరెంటు కోతలు, మంచినీటి కొరత ఉంది. తెలంగాణలో జరిగే అభివృద్ధిలో కనీసం పది శాతమైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతుందా? అనవసరంగా లొల్లి పెట్టడం ఒక్కటే బీజేపీ నేతలకు చేతనయ్యేది..” అని  కేసీఆర్ మండిపడ్డారు.

తెలంగాణ ఇంజన్ స్పీడ్..
‘‘బీజేపీ నేతల చేతగాని తనాన్ని ప్రజలు చూశారు. అందుకే కేంద్రంలో ప్రభుత్వం మారాలని చెబుతున్నాం. తప్పకుండా మారుస్తాం. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు రావాలని మోదీ చెప్పారు. ఈ విషయంలో వారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. తెలంగాణ సర్కారు ఇంజన్‌ ఫుల్ స్పీడ్‌గా ఉంది.  కేంద్రంలోనూ తెలంగాణలా స్పీడ్‌ గా ఉన్న ప్రభుత్వం రావాలి. తెలంగాణ స్థాయిలో కేంద్రం పనిచేస్తే జీడీపీ ఇంకా పెరుగుతుంది. కేంద్రంలో తప్పకుండా బీజేపీయేతర డబుల్‌ ఇంజన్‌ సర్కారు రావాల్సి ఉంది..” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

బీజేపీ నేతలకు అహంకారం..
‘‘బీజేపీ నేతలకు అహంకారం పెరిగింది. మొత్తం 119 స్థానాల్లో 110 సీట్లున్న చోట ఏక్‌ నాథ్‌ షిండే వంటివాళ్లు వస్తారా? బీజేపీ వాళ్ల మాటలకు అంతు ఉండాలి. తెలంగాణలో మూడో వంతు మెజార్టీతో టీఆర్ఎస్ గెలిచింది. ఇక కట్టప్పలా.. కాకరకాయలా? కట్టప్పలు, ఏక్‌నాథ్‌ షిండే వంటి కుక్కమూతి పిందెలా రాష్ట్రానికి కావాల్సింది? షిండే వచ్చి ఏం చేశారు? మహారాష్ట్రలో 20శాతం విద్యుత్‌ చార్జీలు పెంచారు’’ అని కేసీఆర్ విమర్శించారు. బీజేపీ అసమర్థ విధానాల వల్ల దేశం పరువు పోతోందని.. నుపుర్ శర్మ విషయంగా సుప్రీంకోర్టు లక్ష్మణరేఖ దాటిందని విశ్రాంత జడ్జిలతో లేఖ రాయించడం ఏమిటని కేసీఆర్ మండిపడ్డారు. బీజేపీ నేతలు సుప్రీంకోర్టును కూడా ఖాతరు చేయట్లేదని.. సీఎంలను, న్యాయమూర్తులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.

More Telugu News