Prabhas: ఒకే సినిమాలో ప్రభాస్, యశ్.. అభిమానులకు పండగే

  • ‘సలార్’లో అతిథి పాత్ర చేయనున్న యశ్
  • ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ‘సలార్’
  • ప్రభాస్ సరసన హీరోయిన్ గా శ్రుతీ హాసన్
Yash to make a guest appearance in Prabhas film

ప్రభాస్, యశ్. ఇద్దరూ దక్షిణాది హీరోలే. కానీ, చెరో సినిమాతో ఈ ఇద్దరూ ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్ స్టార్స్ గా మారిపోయారు. ‘బాహుబలి’తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటాడు ప్రభాస్. ఆ తర్వాత ‘సాహో’తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మూడు ప్యాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్‌’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు ‘ఆదిపురుష్‌’, ‘ప్రాజెక్ట్ కే’తో వరసగా బాక్సాఫీసును షేక్ చేయాలని చూస్తున్నాడు.

మరోవైపు ‘కేజీఎఫ్‌’ 1, 2 చిత్రాలతో కన్నడ నటుడు యశ్ కూడా ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ అయిపోయాడు. ఒక్కొక్కరుగానే భారత చిత్ర పరిశ్రమని షేక్ చేస్తున్న ప్రభాస్, యశ్ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? వీళ్లు కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తే హాలీవుడ్ సినిమాలను మించి వసూళ్లు రాబట్టడం ఖాయమే అనొచ్చు. 

ప్రస్తుతానికి మల్టీస్టారర్ ఆలోచన పక్కనబెడితే... ఈ ఇద్దరూ కలిసి వెండితెరపై కనిపించబోతున్నారు. ‘సలార్‌‌‌‌’ చిత్రంలో యశ్‌‌ ఓ అతిథి పాత్ర చేయనున్నాడని సమాచారం. ‘కేజీఎఫ్ 1, 2’తో తనకు అనూహ్య స్టార్ డమ్ తెచ్చిపెట్టిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ‘సలార్’లో కొన్ని నిమిషాలు కనిపించేందుకు యశ్ ఒప్పుకున్నాడని తెలుస్తోంది. 

యశ్ పాత్ర నిడివి తక్కువే అయినా.. ప్రభాస్ తో వచ్చే ఆ సన్నివేశాలు అద్భుతంగా ఉండేలా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడట. దాంతో, యశ్, ప్రభాస్ ను ఒకే సినిమాలో చూసే అవకాశం అభిమానులకు తొందర్లోనే రానుంది. కాగా, ‘సలార్’ రెండు వేర్వేరు కాలాల్లో సాగే చిత్రమని, ప్రభాస్ రెండు రకాల పాత్రల్లో  కనిపించబోతున్నాడట. ఈ చిత్రంలో శ్రుతీ హాసన్ హీరోయిన్. పృథ్విరాజ్ సుకుమారన్‌‌ విలన్‌‌గా నటిస్తున్నాడు. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడు యశ్ కూడా తోడైతే సినిమా అంచనాలు మరిన్ని రెట్లు పెరగడం ఖాయం అనొచ్చు.

More Telugu News