నేటి నుంచే జగన్నాథ రథ యాత్ర.. రెండేళ్ల తర్వాత భక్తులకు అనుమతి
- తొమ్మిది రోజుల పాటు జరగనున్న యాత్ర
- ఇప్పటికే పూరి పట్టణం చేరుకున్న వేలాది భక్తులు
- ఈ సారి పది లక్షల మంది హాజరవుతారని అధికారుల అంచనా
రెండు సంవత్సరాల తర్వాత ఈ యాత్రకు పూర్తి స్థాయి భక్తులను అనుమతిస్తున్నారు. దాంతో, ఒడిశా అంతటా భక్తుల్లో ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. కొవిడ్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లు రథయాత్రకు భక్తులను అనుతించలేదు. రెండేళ్ల విరామం తర్వాత రథయాత్రలో పాల్గొనేందుకు ప్రజలను అనుమతించడంతో సుమారు 10 లక్షల మంది తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇతర మతాల వారు, జగన్నాథ ఆలయంలోకి ప్రవేశం లేని విదేశీయులు కూడా త్రిమూర్తుల దర్శనం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఒక అధికారి తెలిపారు.
రథయాత్ర సజావుగా సాగేందుకు అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పూరీ, చుట్టుపక్కల వెయ్యి మంది పోలీసులను, 180 ప్లాటూన్ల సాయుధ బలగాలను మోహరించారు. పూరీలోని గ్రాండ్ రోడ్, ఇతర ప్రదేశాలలో దాదాపు 50 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.