Degree Colleges: తెలంగాణలో దోస్త్​ నోటిఫికేషన్​ విడుదల.. వచ్చే నెల 6 నుంచి వెబ్​ ఆప్షన్లు

  • మొత్తం 4.25 లక్షల సీట్ల భర్తీకి చర్యలు
  • వెబ్ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్లు మొదలు
  • ఆగస్టు 6న తొలి విడత సీట్ల కేటాయింపు
  • అక్టోబర్ 1 నుంచి తరగతుల ప్రారంభం
Dost notification released in Telangana Web options from the 6th of next month

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదలైంది. బుధవారం తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఉన్నతాధికారులు ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. డిగ్రీ ప్రవేశాల వెబ్ కౌన్సెలింగ్ కోసం వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే నెల ఆరో తేదీ నుంచి 30వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని.. ఆగస్టు 6వ తేదీన తొలి దశ సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. దోస్త్ వెబ్ సైట్ తోపాటు టీఎస్ ఫోలియో యాప్, యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని సహాయ కేంద్రాల ద్వారా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు.

మొత్తం 4.25 లక్షల సీట్లు
తెలంగాణలో వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో మొత్తం 1,060 ప్రైవేటు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో అన్ని కోర్సుల్లో కలిపి 4.25 లక్షల మేర డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. వీటన్నింటి భర్తీకి చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. ఆగస్టు 6న మొదటి విడత సీట్లు కేటాయిస్తామని.. సీటు లభించినవారు ఆ నెల 18వ తేదీలోపు సదరు కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. తర్వాత దశల వారీగా రెండో, మూడో విడత వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

More Telugu News