ఉద్ధవ్ థాకరే గూండాయిజం అంతం కావాలి.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి: నవనీత్ కౌర్

Navneet Rana demands presidents rule in Maharashtra
  • తీవ్ర రాజకీయ సంక్షోభంలో మహారాష్ట్ర రాజకీయాలు
  • ఉద్ధవ్ థాకరేపై శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు
  • రెబెల్ ఎమ్మెల్యేల కుటుంబాలకు భద్రత కల్పించాలని కోరిన నవనీత్ కౌర్
మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. శివసేన కీలక నేత ఏక్ నాథ్ షిండే ఆ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలతో కలిసి గువాహటిలో క్యాంపు పెట్టారు. మరోవైపు రెబెల్ ఎమ్మెల్యేలపై శివసేన శ్రేణులు నిరసన కార్యక్రమాలకు తెరదీశాయి. 

ఈ నేపథ్యంలో లోక్ సభ ఇండిపెండెంట్ ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే గూండాయిజాన్ని అంతం చేయాలని ఆమె అన్నారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరారు. బాల్ థాకరే సిద్ధాంతాలను అనుసరిస్తూ, సొంత నిర్ణయాలు తీసుకుంటున్న రెబెల్ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు హాని కలిగే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇటీవల థాకరే ఇంటి ముందు హనుమాన్ చాలీసాను పఠించేందుకు నవనీత్ కౌర్ యత్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెను, ఆమె భర్తను అరెస్ట్ చేశారు. ఇద్దరూ కూడా కొన్ని రోజులు రిమాండ్ లో ఉండి బెయిల్ పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో థాకరేపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు.
Go Back to Shorts
Navneet Rana
Uddhav Thackeray
Shiv Sena
Amit Shah
BJP
Maharashtra
President Rule

More Telugu News