Andhra Pradesh: ఏపీలో విషాదం.. బైక్ పై విద్యుత్ వైర్లు తెగిపడి అన్నదమ్ముల సజీవదహనం

  • జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో విషాదం
  • పాలు తెచ్చేందుకు బైక్ పై బయల్దేరిన అన్నదమ్ములు
  • మార్గమధ్యంలో బైక్ పై తెగిపడ్డ 11 కేవీ విద్యుత్ తీగ
Two brothers dead as electricity wire falls on byke

ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఇద్దరు అన్నదమ్ములు సజీవదహనమయ్యారు. వివరాల్లోకి వెళ్తే దేవులపల్లికి చెందిన అన్నదమ్ములు వల్లేపల్లి నాగేంద్ర (21), వల్లేపల్లి ఫణీంద్ర (19) పాలు తెచ్చేందుకు పొలం వద్దకు బైక్ పై బయల్దేరారు. 

మార్గమధ్యంలో 11 కేవీ విద్యుత్ తీగ తెగి వీరి బైక్ పై పడింది. దీంతో మంటలు చెలరేగాయి. బైక్ పై ఉన్న అన్నదమ్ములిద్దరూ మంటలు అంటుకుని సజీవదహనమయ్యారు. చేతికి అందొచ్చిన కొడుకులు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతంగా ఉంది. 

మృతి చెందిన వారిలో నాగేంద్ర బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుండగా, ఫణీంద్ర ఇంటర్ సెకండియర్ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే దీనికి కారణమని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. దీనికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

More Telugu News