Gannavaram: మొహాలీలో గన్నవరం ఎమ్మెల్యే వంశీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స

  • ఐఎస్‌బీలో ఏఎంపీపీపీ కోర్సు చేస్తున్న వంశీ
  • మొహాలీలో తరగతులకు హాజరు
  • ఎడమ చేయి లాగినట్టు అనిపించడంతో ఆసుపత్రికి
  • ఒకటి రెండు రోజుల్లోనే డిశ్చార్జ్ చేస్తామన్న వైద్యులు
Gannavaram MLA Vallabhaneni Vamsi Hospitalized

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతతో మొహాలీలోని ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేయనున్నట్టు చెప్పారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) హైదరాబాద్‌లో గతేడాది సీటు సాధించిన వంశీ.. అడ్వాన్స్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ పాలసీ (AMPPP) కోర్సు చేస్తున్నారు. 

వంశీ సోమవారం నుంచి పంజాబ్‌లోని మొహాలీ క్యాంపస్‌లో తరగతులకు హాజరవుతున్నారు. నిన్న క్లాస్‌కు వెళ్లిన ఆయనకు ఎడమచేయి లాగినట్టు అనిపిస్తుండడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి వెళ్లారు. అక్కడాయనకు ఈసీజీ, 2డీ ఎకో వంటి పరీక్షలు నిర్వహించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఒకటి రెండు రోజుల్లో వంశీని డిశ్చార్జ్ చేస్తామని కుటుంబ సభ్యులకు వైద్యులు సమాచారం అందించారు.

More Telugu News