అగ్నిప‌థ్‌ను నిలిపివేయండి!... మోదీకి కేర‌ళ సీఎం లేఖ‌!

భార‌త సైన్యంలో భారీ నియామ‌కాలు, దేశ యువ‌త‌కు ఉద్యోగాల క‌ల్ప‌న దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన అగ్నిప‌థ్ ప‌థ‌కంపై నిర‌స‌న‌లు రేకెత్తిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌థ‌కంపై తాజాగా ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ ద‌ళాల అధినేత‌ల‌తో వ‌రుస‌గా రెండో సారి భేటీ అయ్యారు. ఈ భేటీ అనంత‌రం ఆదివారం మీడియా ముందుకు వ‌చ్చిన త్రివిధ ద‌ళాల అధిప‌తులు... అగ్నిప‌థ్ ప‌థ‌కంపై వెన‌క‌డుగు వేసే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెప్పారు. అంతేకాకుండా అగ్నివీర్‌ల‌కు ల‌భించే సౌల‌భ్యాల‌ను కూడా వారు వివ‌రించారు. 

ఓ వైపు త్రివిధ ద‌ళాల అధిప‌తులతో ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ‌రుస భేటీలు నిర్వ‌హిస్తూ ఉంటే.. మ‌రోవైపు ఏకంగా అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని వాయిదా వేయాలంటూ ఓ ముఖ్య‌మంత్రి నేరుగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి లేఖ రాశారు. అగ్నిపథ్ పథకంపై పునరాలోచన చేయాలంటూ కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ ప్ర‌ధాని మోదీకి లేఖ రాశారు. త‌క్ష‌ణ‌మే అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని నిలిపివేయాల‌ని కోరిన విజ‌య‌న్‌... యువ‌త‌లో నెల‌కొన్న ఆందోళ‌న‌ల‌పై దృష్టి సారించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.


More Telugu News