Telangana: పాలేరు నుంచి పోటీ చేస్తున్నా: వైఎస్సార్టీపీ అధినేత్రి ష‌ర్మిల ప్ర‌క‌ట‌న‌

ys sharmila say will contest from paleru of khammam district in forth coming elections
  • ఖ‌మ్మం జిల్లాలో వైఎస్ ష‌ర్మిల పాద‌యాత్ర‌
  • నేల‌కొండ‌ప‌ల్లి స‌మీపంలో పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం
  • బ‌య్యారం గ‌నుల్లో త‌న‌కు వాటాలు లేవ‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌
  • ఈ విష‌యంపై త‌న పిల్ల‌ల‌పై ప్ర‌మాణం చేసేందుకూ సిద్ధ‌మ‌న్న షర్మిల‌
రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాను ఖ‌మ్మం జిల్లా పాలేరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌నున్న‌ట్లు వైఎస్సార్టీపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల ఆదివారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌న పాద‌యాత్ర‌లో భాగంగా ఆదివారం ఖమ్మం జిల్లా నేల‌కొండ‌ప‌ల్లి స‌మీపంలోని బౌద్ధ స్తూపం ర‌హ‌దారి వ‌ద్ద పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడిన సంద‌ర్భంగా ఆమె ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పాలేరు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల అభీష్టం మేర‌కే తాను ఈ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని ఆమె చెప్పుకొచ్చారు. తెలంగాణ‌లో వైఎస్సార్ సంక్షేమ పాల‌న ప్రారంభం కావాల‌ని ఆమె ఆకాంక్షించారు. 

ఖ‌మ్మం జిల్లా ప‌రిధిలోని బ‌య్యారం గ‌నుల్లో త‌న‌కు వాటాలున్నాయంటూ వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పైనా వైఎస్ ష‌ర్మిల స్పందించారు. బ‌య్యారం గ‌నుల్లో త‌న‌కు వాటాలు లేవ‌ని ఆమె తేల్చిచెప్పారు. ఈ విష‌యంపై తాను త‌న బిడ్డ‌ల మీద ప్ర‌మాణం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాన‌ని ఆమె చెప్పారు. అదే స‌మ‌యంలో మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ తాను ఏ అవినీతికీ పాల్ప‌డ‌లేద‌ని త‌న బిడ్డ‌ల‌పై ప్ర‌మాణం చేయ‌గ‌ల‌రా? అంటూ ఆమె ప్ర‌శ్నించారు. ఖ‌మ్మం జిల్లాలో వైఎస్ ఫొటో పెట్టుకుని చాలా మంది గెలిచార‌ని, అలాంటి నేత‌పై విమ‌ర్శ‌లు గుప్పించే అర్హ‌త పువ్వాడ‌కు లేద‌ని ష‌ర్మిల చెప్పారు.

More Telugu News

Telangana
YSRTP
YS Sharmila
Khammam District
Paleru
Bayyaram