Sri Lanka: శ్రీలంకలో తెలంగాణ వ్యాపారవేత్త అరెస్ట్.. విడుదల

  • నిజామాబాద్ కు చెందిన రవీందర్ రెడ్డి అరెస్ట్
  • అక్కడి ప్రజలకు డబ్బులు పంచుతుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • విచారణ తర్వాత విడుదల చేసిన వైనం
Telangana businessman arrested in Sri Lanka

తెలంగాణకు చెందిన వ్యాపారవేత్త శ్రీలంకలో అరెస్ట్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లాకు చెందిన రవీందర్ రెడ్డి ఇటీవల శ్రీలంకకు వెళ్లారు. గత కొన్ని నెలలుగా శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అన్నింటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 

ఈ క్రమంలో రవీందర్ రెడ్డి మానవతా ధృక్పథంతో అక్కడి ప్రజలకు డబ్బులు పంచారు. దీన్ని గమనించిన శ్రీలంక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు రూ. 5 లక్షలు పంచుతుండగా ఆయనను పట్టుకున్నారు. ఆ తర్వాత విచారణ జరిపి వదిలేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలిపారు. 

తాను ప్రతి నెల శ్రీలంక వెళ్తానని రవీందర్ రెడ్డి చెప్పారు. అక్కడ ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు ఆహారం, డబ్బులు, ఇతర వస్తువులు అందిస్తానని తెలిపారు. నెలలో 9 నుంచి 21 రోజుల పాటు అక్కడే ఉంటానని చెప్పారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నానని తెలిపారు. మన కరెన్సీని శ్రీలంక కరెన్సీలోకి మార్చి... రూ. 500, రూ. 1,000 నోట్లను ప్రజలకు పంచుతుండగా పోలీసులు తనను అరెస్ట్ చేశారని చెప్పారు.

More Telugu News