BJP: ఈ ఎంపీకి కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ రూ.15 వేల కోట్ల నిధులు బాకీ ప‌డ్డారు!

  • ఒక్క కిలో బ‌రువు త‌గ్గితే రూ.1,000 కోట్లు ఇస్తాన‌ని గ‌డ్క‌రీ ప్ర‌క‌ట‌న‌
  • ఈ మాట‌తో బ‌రువు త‌గ్గే ప‌నిలో ప‌డ్డ ఉజ్జ‌యిని ఎంపీ అనిల్‌
  • ఇప్ప‌టికే 15 కిలోల బ‌రువు త‌గ్గిన అనిల్ ఫిరోజియా
  • త‌న‌కు ఇచ్చిన మాట‌ను కేంద్ర మంత్రికి గుర్తు చేస్తాన‌న్న ఎంపీ
ujjain mp Anil Ferozia loss weight by the union minister nitin gadkari challenge

నిజ‌మే.. బీజేపీ నేత‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జ‌యినీ లోక్ స‌భ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన అనిల్ ఫిరోజియాకు కేంద్ర ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ రూ.15 కోట్ల మేర నిధులు బాకీ ప‌డ్డారు. త‌న బాకీ వ‌సూలు విష‌యంపై త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న వ‌ర్షాకాల పార్ల‌మెంటు స‌మావేశాల్లో నితిన్ గ‌డ్క‌రీతో చ‌ర్చిస్తాన‌ని అనిల్ చెబుతున్నారు. అయినా ఓ కేంద్ర మంత్రి ఏమిటీ?.. ఆయ‌న సొంత పార్టీకి చెందిన ఎంపీకి నిధులు బాకీ ప‌డ‌ట‌మేమిటి, అనుకుంటున్నారా? ఇదో ఆస‌క్తి రేకెత్తించే క‌థ‌. ఆ క‌థ‌లోకి వెళ్లిపోదాం ప‌దండి.

ప్ర‌స్తుతం కేంద్ర ర‌వాణా శాఖ మంత్రిగా నితిన్ గడ్క‌రీ కీల‌క బాధ్య‌త‌ల్లో ఉన్నారు క‌దా. ప్ర‌స్తుతానికి కాస్తంత  బొద్దుగా క‌నిపించే గడ్క‌రీ... గ‌తంలో ఏకంగా 137 కిలోల మేర బ‌రువు ఉండేవార‌ట‌. ఎలాగోలా క‌స‌రత్తులు చేసిన భారంగా ఉన్న అధిక బ‌రువును 93 కిలోల‌కు త‌గ్గించుకున్నార‌ట‌. 137 కిలోల బ‌రువు ఉన్న స‌మ‌యంలో తాను ఎలా ఉండేవాడిన‌న్న విష‌యాన్ని చెప్పేందుకు గ‌డ్క‌రీ ఓ ఫొటోను కూడా త‌న వెంట తీసుకెళ్లేవార‌ట‌. ఈ క్ర‌మంలో ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఉజ్జ‌యిని ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఆ స‌మ‌యంలో 125 కిలోల బ‌రువున్న స్థానిక ఎంపీ అనిల్ ఫిరోజియాను చూసిన గడ్క‌రీ... బ‌రువు త‌గ్గాల‌ని సూచించార‌ట‌.

అధిక బ‌రువు వ‌ల్ల క‌లిగే న‌ష్టాల‌ను ఈ సంద‌ర్భంగా గ‌డ్క‌రీ వివ‌రించారు‌. అంతేకాకుండా 135 కిలోల బ‌రువున్న స‌మ‌యంలో తాను ఎలా ఉన్నాన‌న్న ఫొటోను కూడా అనిల్‌కు చూపించారు‌. ఇక ఉజ్జ‌యిని స‌భ‌లో జ‌నాన్ని ఉద్దేశించి మాట్లాడిన సంద‌ర్భంగా ఉజ్జ‌యిని అభివృద్ధికి నిధులిమ్మంటూ అనిల్ నిత్యం త‌న‌ను అడుగుతూ ఉంటార‌ని చెప్పిన గ‌డ్క‌రీ... ఎంపీ బ‌రువు త‌గ్గితే నిధులిస్తాన‌ని చెప్పార‌ట‌. ఒక కేజీ బ‌రువు త‌గ్గితే...రూ.1 వెయ్యి కోట్ల చొప్పున ఎంపీ ఎంత బ‌రువు త‌గ్గితే అన్ని వెయ్యి కోట్ల నిధులు ఉజ్జ‌యినికి కేటాయిస్తాన‌ని గ‌డ్క‌రీ చెప్పార‌ట‌. 

ఈ మాట‌ను కాస్తంత సీరియ‌స్‌గానే తీసుకున్న అనిల్ ఫిరోజియా బ‌రువు త‌గ్గే మార్గాల‌పై దృష్టి పెట్టార‌ట‌. ఇప్ప‌టిదాకా ఆయ‌న ఏకంగా 15 కిలోల బ‌రువు త‌గ్గారు‌. ఈ సంద‌ర్భంగా తాజాగా త‌న‌ను క‌లిసిన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి చెప్పిన‌ట్టే తాను బ‌రువు త‌గ్గాన‌ని...త‌న‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం కేంద్ర మంత్రి కూడా ఉజ్జ‌యినికి నిధులు ఇస్తార‌ని అనుకుంటున్నాన‌ని చెప్పారు. 

తాను 15 కిలోల బ‌రువు త‌గ్గాన‌ని.. ఈ క్ర‌మంలో ఉజ్జ‌యినికి గడ్క‌రీ రూ.15,000 కోట్ల నిధులు ఇవ్వాల్సి ఉంద‌ని చెప్పారు. ఇదే విష‌యాన్ని త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల్లో గ‌డ్క‌రీ వ‌ద్ద ప్ర‌స్తావిస్తాన‌ని, తాను బ‌రువు త‌గ్గిన వివ‌రాలు కూడా ఆయ‌న ముందు పెడతాన‌ని అనిల్ చెప్పారు.

More Telugu News