Vallabhaneni Vamsi: యార్లగడ్డ వెంకటరావు వర్సెస్ వల్లభనేని వంశీ.. గన్నవరం టికెట్ పై మాటల యుద్ధం

  • వంశీ ఉన్నా జగన్ తనకే ఇస్తారన్న వెంకటరావు
  • ఇసుక దోపిడీపై విచారణ జరిపించాలని డిమాండ్
  • అప్పుడప్పుడు వచ్చిపోయే వారి గురించి పట్టించుకోనన్న వంశీ 
  • జగన్ తనకే టికెట్ ఇస్తారన్న నమ్మకం ఉందని వ్యాఖ్య  
Vallabhaneni Vamshi Counters Yarlagadda Venkat Rao

ఏపీలోని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ కు సంబంధించి యార్లగడ్డ వెంకటరావు, వల్లభనేని వంశీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. రాబోయే ఎన్నికల్లో గన్నవరం టికెట్ తనదేనని వెంకటరావు అన్నారు. గన్నవరం పరిధిలో గతంలో ఇసుక దోపిడీ జరిగిందని, దానిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. 

నియోజకవర్గంలో వల్లభనేని వంశీ ఉన్నప్పటికీ జగన్ తనకే టికెట్ ఇస్తారన్న నమ్మకం ఉందని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి సమస్యా తనకు తెలుసన్నారు. కాగా, చంద్రబాబునుగానీ, జగన్ నుగానీ తాను వ్యక్తిగతంగా తిట్టలేదని, తాను టీడీపీలోకి వెళుతున్నానన్న మాట అబద్ధమని చెప్పారు. 

కాగా, ఆ వ్యాఖ్యలకు వల్లభనేని వంశీ కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ మద్దతు తనకే ఉందన్నారు. అప్పుడప్పుడు వచ్చిపోయేవారి గురించి తాను అస్సలు పట్టించుకోనన్నారు. ఎవరికి సీటివ్వాలో జగన్ నిర్ణయిస్తారన్నారు. జగన్ పనిచేయాలని సూచించారని, తాను చేస్తున్నానని చెప్పారు. మిగతా వారి గురంచి పార్టీనే చూసుకుంటుందన్నారు. 

తాను గెలిచినా ఓడినా గన్నవరంలోనే ఉన్నానని చెప్పారు. టీడీపీలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్లు, వైసీపీలో ఉన్నా టీడీపీ వాళ్లూ తన సాయం పొందారని పేర్కొన్నారు. తాను 15 సినిమాలు తీశానని, ఆ సినిమాల్లో ఆయన లాంటి క్యారెక్టర్లు చాలా ఉన్నాయని అన్నారు. తాను విలన్ అయితే.. ఆయనేమో మహేశ్ బాబా? అంటూ ఎద్దేవా చేశారు. జస్టిస్ చౌదరీ సినిమా గురించి కూడా ప్రస్తావించారు. 

కాగా, మట్టి తవ్వకాలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని వంశీ విమర్శించారు. గన్నవరంలోని మట్టిని కుప్పం వరకు ఎలా తరలిస్తామని ప్రశ్నించారు. ఆ మట్టిని అక్కడిదాకా తరలించేందుకు.. ఆ మట్టికన్నా ఎక్కువగా డీజిల్ కే ఖర్చవుతుందని చెప్పారు. ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరికైనా ఈ విషయం తెలుస్తుందన్నారు. 

More Telugu News