Sathyadev: ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో: ' గాడ్సే' ట్రైలర్  రిలీజ్!

  • సత్యదేవ్ హీరోగా 'గాడ్సే'
  • స్వార్థ రాజకీయాల చుట్టూ అల్లుకున్న కథ
  • ప్రతినాయకుడిగా సిజూ మీనన్ 
  • ఈ నెల 17వ తేదీన సినిమా విడుదల 
Godse Movie trailer released

సత్యదేవ్ మంచి నటుడు .. అయితే ఇంతవరకూ ఆయనకి సరైన బ్రేక్ ఇచ్చే సినిమా పడలేదనే చెప్పాలి. సినిమాల ఫలితం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ, ఆయనలోని టాలెంట్ ను వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన 'గాడ్సే' సినిమా ఈ నెల 17వ తేదీన థియేటర్లకు రానుంది.

సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమాకి గోపీ గణేశ్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హీరో పాత్రను కేంద్రంగా చేసుకుని .. ఆయన చుట్టూ అల్లుకున్న సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్  చేశారు. 'ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు' అనే డైలాగ్ ఆలోచింపజేస్తోంది. 

'అర్హత ఉన్నోడే అసెంబ్లీలో ఉండాలి .. పద్ధతున్నోడే పార్లమెంటులో ఉండాలి' అనే డైలాగ్ పవర్ఫుల్ గా ఉంది. స్వార్థ రాజకీయాలపై ఒక యువకుడు సాగించిన పోరాటంగా ఈ సినిమా కనిపిస్తోంది. ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, విలన్ గా సిజూ మీనన్ కనిపిస్తున్నాడు. ఈ సినిమాతో సత్యదేవ్ కి హిట్ పడుతుందేమో చూడాలి.

More Telugu News