Kakinada: గుండెపోటుతో మరణించిన సాధువు.. అతడి గదిలో డబ్బులే డబ్బులు!

  • కాకినాడ జిల్లా కరప మండలంలోని వేళంగిలో ఘటన
  • పాలిథిన్ కవర్లలో కరెన్సీ నోట్లు
  • రూ. 2 లక్షల వరకు ఉండొచ్చంటున్న స్థానికులు
  • నేడు లెక్కిస్తామన్న పోలీసులు
more than Rs 2 lakh currency notes in a beggar room who died with heart attack

గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందిన యాచకుడి గదిలో కుప్పలుగా పడివున్న నోట్ల కట్టలను చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. కాకినాడ జిల్లా కరప మండలంలోని వేళంగిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రామకృష్ణ అనే సాధువు ఐదేళ్ల క్రితం గ్రామానికి వచ్చి భిక్షాటన చేస్తూ, రక్ష రేకులు కడుతూ జీవించేవాడు. స్థానిక చేపల మార్కెట్ వద్ద చిన్న గదిలో ఉండేవాడు. సమీపంలోని సత్రంలో రోజూ భోజనం చేస్తూ కాలం వెళ్లదీసేవాడు. నిన్న ఆయన గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సాధువు రామకృష్ణ గదిలోకి వెళ్లారు. లోపల రెండు సంచులు నిండుగా కనిపించాయి. వాటిని తెరిచిన పోలీసులు ఆశ్చర్యపోయారు. వాటినిండా కరెన్సీ నోట్లున్న పాలిథిన్ కవర్లు కనిపించాయి. వాటిలో ఎక్కువగా పది రూపాయల నోట్లు ఉన్నట్టు ఎస్సై డి.రమేశ్ బాబు తెలిపారు.

ఆ సొమ్ము మొత్తం దాదాపు రూ. 2 లక్షల వరకు ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. చీకటి పడడం, చిల్లర నోట్లు కావడంతో లెక్కించడం సాధ్యం కాకపోవడంతో డబ్బు సంచులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ సొమ్మును నేడు లెక్కించనున్నట్టు పోలీసులు తెలిపారు. పంచాయతీ కార్మికుల సాయంతో రామకృష్ణ మృతదేహాన్ని ఖననం చేసినట్టు చెప్పారు.

More Telugu News