Andhra Pradesh: ఏపీ స‌ర్కారీ స‌ర్వే ప‌త్రాన్ని కాల్చేసి, అధికారుల గ్రూప్‌లో వీడియోను పోస్ట్ చేసిన వలంటీర్‌

  • ఏపీలో ఇటీవ‌లే ప్రారంభ‌మైన‌ గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం
  • సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారుల వివ‌రాల సేక‌ర‌ణ బాధ్య‌త‌లు వ‌లంటీర్ల‌కు
  • ఇందుకోసం స‌ర్వే ప‌త్రాల‌ను వలంటీర్ల‌కు పంపిన ప్ర‌భుత్వం
  • గొడ్డు చాకిరీతో ఫ్ర‌స్ట్రేష‌న్ పెరుగుతోంద‌న్న వ‌లంటీర్ బాషా

ఏపీ ప్ర‌భుత్వం నుంచి సంక్షేమ ప‌థ‌కాలు అందుకున్న వారి వివ‌రాల‌ను సేక‌రించాలంటూ అందించిన స‌ర్వే ప‌త్రాన్ని కాల్చేసి... దానిని వీడియో తీసి అధికారులు, వ‌లంటీర్లు ఉండే వాట్సాప్ గ్రూప్‌లో దానిని పోస్ట్ చేసిన ఓ వ‌లంటీర్‌... దానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నార‌ని, అందుకే త‌మ‌లో ఫ్ర‌స్ట్రేష‌న్ పెరిగిపోయింద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. బాప‌ట్ల జిల్లా ప‌రిధిలోని వేమూరు నియోజ‌క‌వ‌ర్గం భ‌ట్టిప్రోలు గ్రామంలో వ‌లంటీర్‌గా ప‌నిచేస్తున్న బాషా ఈ వినూత్న నిర‌స‌న‌కు దిగారు. 

ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే... వైసీపీ స‌ర్కారు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం పేరిట ఓ కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు అందుకున్న వారి వివ‌రాల‌ను ఇంటింటికీ వెళ్లి సేక‌రించాలంటూ వ‌లంటీర్ల‌ను ఆదేశించింది. ఇందుకోసం ప్ర‌త్యేకంగా రూపొందించిన ఓ స‌ర్వే ప‌త్రాన్ని వ‌లంటీర్ల‌కు పంపింది. ఈ స‌ర్వేపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన బాషా... ఆ స‌ర్వే ప‌త్రాన్ని కాల్చేశారు. కాలుతున్న స‌ర్వే ప‌త్రాన్ని వీడియో తీశారు. ఆ వీడియోను స‌హ‌చ‌ర వ‌లంటీర్ల‌తో పాటు అధికారులు ఉండే వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు అధికారుల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

More Telugu News