BJP: పల్లెల నడుములు విరుస్తోంది.. టీఆర్ఎస్ సర్కార్ పై సంజయ్ ఫైర్

  • సర్పంచులకు బీజేపీ తెలంగాణ చీఫ్ బహిరంగ లేఖ
  • సర్పంచులు అప్పులు తెచ్చి అభివృద్ధి చేసినా సర్కారు బిల్లులు చెల్లించట్లేదని మండిపాటు 
  • ప్రభుత్వ వైఖరి పట్ల ‘మౌనదీక్ష’ చేస్తామని వెల్లడి
Sanjay Open Letter To Sarpanches

గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా దేశమంతా సర్పంచులకు నిధులు, విధుల వినియోగంలో సర్వాధికారాలనిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చినా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను నీరుగారుస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు సంజయ్ మండిపడ్డారు. అభివృద్ధికి పల్లెలు పట్టుగొమ్మలని, కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ వైఖరితో నిధులు విడుదల చేయకుండా ఆ నడుములను విరిచేస్తోందని ఆయన విమర్శించారు. ఇవాళ ఆయన తెలంగాణ సర్పంచులకు బహిరంగ లేఖ రాశారు. 

పంచాయతీల అభివృద్ధి కోసం 2014 ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయని ఆయన అన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఈ 8 ఏళ్ల పాలనలో జరిగినదేమిటో అర్థం చేసుకోవాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోందన్నారు. సర్పంచులు అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేస్తుంటే.. రూ.2 లక్షల నుంచి రూ.25 లక్షల వరకున్న ఆ బిల్లులను ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందన్నారు. 

నిధులు మంజూరు చేస్తున్నట్టు జీవోలు ఇస్తున్నా.. అకౌంట్లను మాత్రం ఫ్రీజ్ చేస్తోందని దుయ్యబట్టారు. సర్పంచులెవరైనా ప్రశ్నిస్తే.. సస్పెండ్ చేస్తామని, చెక్ పవర్ ను రద్దు చేస్తామని బెదిరిస్తోందని ఆరోపించారు. హక్కుల కోసం గాంధేయ మార్గంలో పోరాటం చేయాలని, బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 

రాష్ట్రంలోని ప్రతి గ్రామాభివృద్ధిలోనూ కేంద్ర ప్రభుత్వ నిధుల వాటా ఉందని సంజయ్ చెప్పారు. సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది అన్న చందంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. పల్లె ప్రగతిలో భాగంగా వైకుంఠ ధామాలకు రూ.11 లక్షలు, రైతు వేదికకు రూ.10 లక్షలు, పల్లె ప్రకృతి వనానికి రూ.4 లక్షలు, డంప్ యార్డ్ నిర్మాణానికి రూ.2.5 లక్షలు, నర్సరీల ఏర్పాటుకు రూ.లక్షన్నర చొప్పున నిధులను కేంద్రమే కేటాయిస్తోందని గుర్తు చేశారు. 

కేంద్రం తన వాటా 100 శాతం చెల్లిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం వాటి వినియోగానికి ఇప్పటిదాకా 15వ కమిషన్ కమిటీ వేయకపోవడం దారుణమన్నారు. ఆ డబ్బులను రాష్ట్ర సర్కారు పక్కదోవ పట్టిస్తోందన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షలు ఇస్తామన్న కేసీఆర్ మాటలను నమ్మి సర్పంచులు అప్పులపాలయ్యారని, అప్పులు చేసి అభివృద్ధి చేసిన రైతులకు ఇప్పటికీ సర్కారు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని సంజయ్ ఫైర్ అయ్యారు. 

దీంతో అప్పులకు వడ్డీలు పెరిగి చాలా మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని, చాలా మంది సర్పంచులు కూలి పనులకూ వెళుతున్నారని ఆవేదన చెందారు. అయినా కూడా కేసీఆర్ బిల్లులు చెల్లించకపోవడం ఆయన కర్కశత్వానికి నిదర్శనమన్నారు. సర్పంచులు ఏ పార్టీ గుర్తు మీదా గెలిచిన వారు కాదని, అధికార పార్టీ ఆగడాలకు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. 

రాష్ట్రంలో ఉత్తమ పంచాయతీలుగా ఎంపికైనవన్నీ బీజేపీ ఎంపీల నియోజకవర్గాల్లోనే ఉన్నాయన్నారు. సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల హక్కుల రక్షణ కోసం త్వరలోనే ‘మౌనదీక్ష’ పోరాటం చేస్తామని, దానికి సర్పంచుల మద్దతు కావాలని సంజయ్ విజ్ఞప్తి చేశారు.

More Telugu News