Woman: ఎవరికీ విడాకులు ఇవ్వకుండానే పెళ్లి మీద పెళ్లి... నిత్య పెళ్లికూతురి గుట్టురట్టు

  • నంద్యాల జిల్లాలో నిత్యపెళ్లికూతురు
  • ఇప్పటివరకు మూడు పెళ్లిళ్లు
  • ఎవరికీ విడాకులు ఇవ్వకుండానే మూడో పెళ్లి
  • కేసు నమోదు చేసిన పోలీసులు
Woman with three marriages

ఓ యువతి ఏ ఒక్కరికీ విడాకులు ఇవ్వకుండా ఇప్పటిదాకా మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఘటన నంద్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఆ యువతి పేరు శిరీష. వయసు 24 సంవత్సరాలు. నంద్యాల మండలంలోని మిట్నాల గ్రామంలో తల్లి మేరీ జసింటాతో కలిసి నివసిస్తోంది. శిరీష బేతంచర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డిని పెళ్లి చేసుకోవాలని భావించింది. 

అయితే, మహేశ్వర్ రెడ్డికి ఇది రెండో వివాహం కావడంతో తనకు ఆర్థిక భద్రత కలిగించేలా రూ.5 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేయాలని మహేశ్వర్ రెడ్డిని శిరీష కోరింది. ఆమె చెప్పినట్టుగానే మహేశ్వర్ రెడ్డి రూ.5 లక్షలు డిపాజిట్ చేశాడు. గత ఫిబ్రవరిలో వీరి పెళ్లి మద్దిలేటి స్వామి క్షేత్రంలో జరిగింది. అనంతరం మహేశ్వర్ రెడ్డి స్వగ్రామం ఆర్ఎస్ రంగాపురంలో కాపురం పెట్టారు. 

కాగా, శిరీష తల్లి తన కుమార్తె అత్తారింట్లో కాపురం చేయాలంటే ఇంకా నగదు, ఆస్తి రాసివ్వాలని డిమాండ్ చేయడం ప్రారంభించింది. ఈ తరహా వేధింపులతో విసిగిపోయిన మహేశ్వర్ రెడ్డి... శిరీష గురించి లోతుగా ఎంక్వైరీ చేయించగా, ఆమెకు ఇదే తొలి పెళ్లి కాదన్న విషయం వెల్లడైంది. గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకుందని, వారిలో ఎవరికీ విడాకులు ఇవ్వకుండానే నెట్టుకొస్తోందని తెలిసి నివ్వెరపోయాడు. తాను కూడా ఆ నిత్యపెళ్లికూతురు వలలో పడ్డానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు శిరీష గురించి చెబుతూ, ఆమెకు మొదట అవుకు మండలం చెన్నంపల్లెకు చెందిన పాణ్యం మల్లికార్జునరెడ్డితో పెళ్లయిందని, ఆ తర్వాత ఆత్మకూరు మండలం కొత్తపల్లెకు చెందిన శ్రీనివాసరెడ్డితో వివాహం జరిగిందని తెలిపారు.

More Telugu News