Dadisetty Raja: హింస వెనుక చంద్రబాబు, పవన్ ఉన్నారు: మంత్రి దాడిశెట్టి రాజా

  • కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని అన్ని పార్టీలు డిమాండ్ చేశాయన్నా రాజా 
  • అందరి ఆకాంక్ష మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వ్యాఖ్య 
  • అమలాపురం ఘటనలో నిందితులను వదిలే ప్రసక్తే లేదన్న మంత్రి 
Chandrababu and Pawan Kalyan are behing Amalapuram violence says Dadiserry Raja

అమలాపురం హింస వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఉన్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని అన్ని పార్టీలు డిమాండ్ చేశాయని చెప్పారు. కొన్ని పార్టీలు వినతి పత్రాలను కూడా ఇచ్చాయని తెలిపారు. 

అలాగే, మేధావులు, ప్రజలు, ప్రజా సంఘాలు ఏకకంఠంతో అంబేద్కర్ జిల్లాకు మద్దతు పలికాయని చెప్పారు. అందరి ఆకాంక్ష మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత టీడీపీ, జనసేన కుట్రలు పన్నాయని, అగ్గి రాజేశాయని అన్నారు. ఈ రెండు పార్టీలు ప్రజలు ముందు ఒకటి, ప్రజల వెనుక మరొకటి మాట్లాడుతున్నాయని చెప్పారు. ఇలాంటి కుట్రలను రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించాలని అన్నారు. అమలాపురం ఘటనలో నిందితులు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు.          

ఏపీకి ఏకైక విలన్ ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబేనని  అన్నారు. కొన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని, ప్రజలంటే భయం లేకుండా, ప్రజలతో ఇష్టం వచ్చినట్టు చెత్త రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న కోనసీమలో చంద్రబాబు, పవన్ అలజడి సృష్టించారని విమర్శించారు.

More Telugu News