Nara Lokesh: మాజీ మంత్రి అవంతి రైతును, పోలీసు అధికారిని, జర్నలిస్టును నోటికొచ్చినట్టు మాట్లాడడం దారుణం: నారా లోకేశ్

  • విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో రైతు భరోసా కార్యక్రమం
  • మాజీ మంత్రి అవంతి ఆగ్రహావేశాలు
  • వీడియో పంచుకున్న లోకేశ్
  • వైసీపీ నేతలకు రోజులు దగ్గరపడ్డాయని వ్యాఖ్యలు
Nara Lokesh slams former minister Avanthi Srinivas

మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పై టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ నేతలకు ఒళ్లు బలిసి, కన్నూ మిన్నూ కానరావడం లేదని మండిపడ్డారు. ప్రశ్నించిన రైతును, రైతును ఆపలేదని పోలీసు అధికారిని, కవరేజి చేస్తున్న మీడియా ప్రతినిధిని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ నోటికొచ్చినట్టు మాట్లాడడం దారుణమని లోకేశ్ విమర్శించారు. 

విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో జరిగిన రైతు భరోసా కార్యక్రమంలో బ్రాహ్మణులను కించపరిచేలా "పంతులూ నీ సంగతి చూస్తా" అంటూ పాత్రికేయుడు గణేశ్ ను బెదిరించడం వైసీపీ నాయకుల అహంకారానికి నిదర్శనం అని విమర్శించారు. 

ఫ్రస్ట్రేషన్ లో మీడియా ప్రతినిధిని కులం పేరుతో దూషించడం, రైతును బూతులు తిట్టడం, ఒరేయ్ అంటూ ఎస్సైపై చిందులు తొక్కడం చూస్తుంటే వైసీపీ నేతలకు రోజులు దగ్గరపడినట్టే కనిపిస్తోందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అవంతి వ్యాఖ్యల వీడియోను కూడా లోకేశ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

More Telugu News