‘గడపగడపకు మన ప్రభుత్వం’లో తనకు వధువును చూసిపెట్టమన్న పెద్దాయన.. ఫక్కున నవ్వేసిన మంత్రి రోజా

  • నగరిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రోజా
  • ప్రజలను కలుసుకుని సంక్షేమ పథకాలపై ఆరా
  • తనకు పిల్లను చూడమన్న వృద్ధుడి ప్రశ్నతో మంత్రి అవాక్కు
  • తన పని అది కాదన్న మంత్రి
వైసీపీ చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా తన అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి రోజాకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. చిత్తూరు జిల్లా నగరిలో నిన్న పర్యటించిన ఆమె ప్రజలను కలుసుకుని ప్రభుత్వ  సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? అన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో మహిళలు రోజాను సత్కరించారు.   

ఈ సందర్భంగా ఒకచోట మంత్రికి విచిత్రమైన అనుభవం ఎదురైంది. తనను కలిసిన ఓ వృద్ధుడిని నెలవారీ పింఛను అందుతుందా? అని ప్రశ్నించారు. అందుకతడు బదులివ్వకుండా తాను ఒంటరివాడనని, తనకెక్కడైనా  పిల్లను చూడాలని కోరాడు. ఆ ప్రశ్నకు అవాక్కైన మంత్రి ఒక్కసారిగా నవ్వేశారు. ఆమెతోపాటు చుట్టుపక్కల ఉన్నవారు కూడా నవ్వును ఆపుకోలేకపోయారు. పెద్దాయన ప్రశ్నకు రోజా బదులిస్తూ తాను పెన్షన్లు మాత్రమే అందేలా చూడగలనని, అమ్మాయిలను చూడడం తన పని కాదని స్పష్టంగా చెప్పేశారు. 

కాగా, మంత్రి నిన్న పుత్తూరు రూరల్ మండలంలోని గోపాలకృష్ణపురంలో నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Roja
Nagari
Gadapa Gadapaku
YSRCP
Bride

More Telugu News