Pawan Kalyan: లేని పొత్తుల గురించి విమర్శించడం కాదు... ముందు అప్పుల సంగతి చూసుకోండి!: పవన్ కల్యాణ్

  • ఏపీ ఆర్థిక పరిస్థితిపై జాతీయ మీడియాలో కథనం
  • శ్రీలంక పరిస్థితికి, ఏపీకి పెద్దగా తేడా లేదని కథనంలో వెల్లడి
  • శ్రీలంక పరిస్థితికి ఏపీ కూతవేటు దూరంలోనే వుందంటూ పవన్ విమర్శలు
Pawan Kalyan comments on AP Govt

ఓ జాతీయ చానల్లో వచ్చిన కథనంపై జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. భారత్ లో అనేక రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోయాయని, వాటిలో ఏపీ కూడా ఒకటని ఆ కథనంలో పేర్కొన్నారు. అప్పులు, జీడీపీ నిష్పత్తి చూస్తే... ఆయా రాష్ట్రాల పరిస్థితి శ్రీలంకకు భిన్నంగా ఏమీలేదని వివరించారు. ఈ కథనం నేపథ్యంలో పవన్ ట్వీట్ చేశారు. 

శ్రీలంక నుంచి తమిళనాడుకు గంట దూరం అని, శ్రీలంక పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ కూతవేటు దూరంలోనే ఉందని విమర్శించారు. ఇప్పుడు కావాల్సింది ఇంకా లేని పొత్తుల గురించి విమర్శించడం, గడప గడపకి ఎమ్మెల్యేలను పంపడం కాదని హితవు పలికారు. 'మీరు చేసిన అప్పుల నుంచి ఆంధ్రప్రదేశ్ ను దూరం జరిపే ప్రయత్నం చేయండి' అని స్పష్టం చేశారు. అంతేకాదు, సదరు జాతీయ మీడియా చానల్ కథనం వీడియోను కూడా పవన్ కల్యాణ్ పంచుకున్నారు.

More Telugu News