Karnataka: నడిరోడ్డుపై మహిళా న్యాయవాదిని కడుపులో తన్నుతూ అమానుష దాడి.. ఇదిగో వీడియో

  • కర్ణాటకలోని బాగల్ కోట్ లో ఘటన
  • అడ్డొచ్చిన భర్తపైనా దాడి చేసిన వ్యక్తి
  • బీజేపీ నేత అండతోనే దాడి చేశారన్న బాధితురాలు
  • ఆస్తి కోసం దాడి చేయించారంటూ ఫిర్యాదు
Woman Lawyer Assaulted By a Man on Busy Road In Karnataka

పట్టపగలు.. నడిరోడ్డు మీద నలుగురూ చూస్తుండగానే ఓ మహిళా న్యాయవాదిపై ఓ వ్యక్తి అత్యంత అమానుషంగా దాడి చేశాడు. కడుపులో తన్నుతూ.. కొడుతూ కర్కశంగా ప్రవర్తించాడు. అడ్డొచ్చిన ఆమె భర్తపైనా దాడి చేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని బాగల్ కోట్ లో నిన్న జరిగింది. దాడి చేసిన వ్యక్తిని మహంతేశ్ చొలచగడ్డ, బాధితురాలిని సంగీత షిక్కేరిగా గుర్తించారు. 

ఇద్దరి మధ్యా ఆస్తి తగాదాల వల్లే మహంతేశ్ దాడి చేశాడని తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు.. బాగల్ కోట్ లోని హార్టికల్చర్ సైన్సెస్ లో ఫొటోగ్రాఫర్ గా పనిచేస్తున్న మహంతేశ్ ను అరెస్ట్ చేశారు. బీజేపీ బాగల్ కోట్ జనరల్ సెక్రటరీ రాజు నాయకర్ తనను ఓ ఆస్తికి సంబంధించిన విషయంలో వేధిస్తున్నాడని, దీనిపై ఇప్పటికే ఫిర్యాదు చేశానని బాధితురాలు సంగీ తెలిపింది. 

ఆ ఘటనకు సంబంధించే తనపై దాడి చేయించారని పేర్కొంది. అయితే, మహంతేశ్ మాత్రం ఆమె వ్యాఖ్యలను ఖండించాడు. తాను ఎవరో చెబితే దాడి చేయలేదని అన్నాడు. ఇటు బీజేపీ నేత రాజు నాయకర్ కూడా సంగీత ఆరోపణలను తోసి పుచ్చాడు. నేను చట్టపరంగానే ఇంటిని కొనుక్కున్నానని, తన అధికారాలను దుర్వినియోగం చేయలేదని చెప్పారు. సంగీతపై దాడికి ఎవరినీ పంపలేదన్నారు. కాగా, ప్రస్తుతం సంగీత, ఆమె భర్త బాగల్ కోట్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

More Telugu News