జనసేన ఒంటరిగా పోటీ చేయాలని అడిగేందుకు మీరెవరు?: పవన్ కల్యాణ్

ఏపీలో ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ పొత్తుల విషయం విపరీతంగా చర్చకు వస్తోంది. ఈ నేపథ్యంలో, వైసీపీ నేతలకు, పవన్ కల్యాణ్ కు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించిన పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 15 సీట్లు కూడా రావని అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వనని చెప్పింది నిజమేనని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమని ధీమా వ్యక్తం చేశారు. 

రాజకీయాల్లో పౌరుషాలు ఉండవని, వ్యూహాలే ఉంటాయని పవన్ వ్యాఖ్యానించారు. జనసేన ఒంటరిగా పోటీచేయాలని అడిగేందుకు మీరెవరు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కన్నీటిని తుడవని ప్రభుత్వం ఎందుకు? అంటూ మండిపడ్డారు. రాష్ట్ర విభజన దెబ్బలు ఇంకా తగులుతూనే ఉన్నాయని అన్నారు. తనపై కేసులు లేవు గనుకనే ఢిల్లీలో ధైర్యంగా మాట్లాడానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇతరుల జెండాలు, అజెండాలు తాను మోయనని పునరుద్ఘాటించారు. 

వైసీపీ పాలనలో ప్రజలకు చిత్రహింసలు తప్పడంలేదని వ్యాఖ్యానించారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అందుకే మీ తరఫున పోరాడేందుకు నన్ను ఆశీర్వదించండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


More Telugu News