Shanthi Priya: మళ్లీ వస్తున్న భానుప్రియ చెల్లెలు!

  • దక్షిణాది, హిందీ చిత్రాల్లో నటించిన శాంతిప్రియ
  • 1987లో తమిళ చిత్రంతో పరిచయం
  • తెలుగులో మహర్షితో ఎంట్రీ
  • 2004లో భర్తను కోల్పోయిన శాంతిప్రియ
  • సరోజిని నాయుడు బయోపిక్ తో రీఎంట్రీ
Shanthi Priya returns to silver screen

తెలుగు చిత్రసీమలో నల్ల కలువ అందాలతో, కట్టిపడేసే అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న నటి భానుప్రియ. తాను దక్షిణాదిన మాంచి ఊపుమీదున్న సమయంలో భానుప్రియ తన చెల్లెలు శాంతిప్రియను కూడా వెండితెర అరంగేట్రం చేయించింది. 90వ దశకంలో శాంతిప్రియ పలు తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో నటించింది. వంశీ దర్శకత్వంలో వచ్చిన మ్యూజికల్ హిట్ మహర్షి చిత్రంలో కథానాయిక శాంతిప్రియే. తెలుగులో ఆమెకు ఇదే మొదటి చిత్రం. 

అంతకుముందే శాంతిప్రియ పలు తమిళ చిత్రాల్లో నటించింది. 1987లో వచ్చిన ఎంగ ఊరు పాట్టుకారన్ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసింది. తెలుగులో మహర్షి తర్వాత సింహస్వప్నం, రక్తకన్నీరు, నాకూ పెళ్లాం కావాలి, నాగార్జునతో అగ్ని వంటి చిత్రాలు చేసింది. 

ఇక హిందీలోనూ అక్షయ్ కుమార్ తో సౌగంధ్, మిథున్ చక్రవర్తితో ఫూల్ ఔర్ అంగార్, సన్నీ డియోల్ లో వీర్తా వంటి చిత్రాల్లో నటించింది. 1994లో వచ్చిన ఇక్కే పే ఇక్కా చిత్రంలో చివరిసారిగా నటించింది. 1999లో ఆమె సిద్ధార్థ్ రేని పెళ్లాడింది. అయితే 2004లో సిద్ధార్థ్ రే గుండెపోటుతో మరణించాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 

ఇన్నాళ్ల పాటు కెమెరాకు దూరంగా ఉన్న శాంతిప్రియ మళ్లీ సినిమాల బాటపడుతోంది. తాజాగా ఓ బయోపిక్ తో రీఎంట్రీ ఇస్తోంది. స్వాతంత్ర్య సమరయోధురాలు, సుప్రసిద్ధ కవయిత్రి సరోజిని నాయుడు జీవితకథ ఆధారంగా తెరకెక్కబోయే చిత్రం ద్వారా శాంతిప్రియ సుదీర్ఘ విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

కెరీర్ మొదట్లో మోడలింగ్ చేసిన శాంతిప్రియ ఇటీవలే బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్ లో తళుక్కుమంది. లేటెస్ట్ ఫ్యాషన్ దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేసింది. 2006 తర్వాత ఆమె ర్యాంప్ పై నడవడం ఇదే ప్రథమం. శాస్త్రీయ నృత్యకారిణి అయిన శాంతిప్రియ... తరచుగా ప్రదర్శనలు ఇస్తున్నప్పటికీ, 16 ఏళ్ల తర్వాత ఓ మోడల్ గా మళ్లీ ర్యాంప్ పై అలరించింది. 

ఈ సందర్భంగా శాంతిప్రియ మాట్లాడుతూ, ఇన్నాళ్లపాటు భార్యగా, తల్లిగా విధులు నిర్వర్తించానని తెలిపింది. తన పిల్లలు కూడా పెద్దవాళ్లయ్యారని, వాళ్లే తనను మళ్లీ నటించేందుకు ప్రోత్సహించారని వివరించింది. 

సరోజిని నాయుడు బయోపిక్ గురించి చెబుతూ... ఇది పాన్ ఇండియా చిత్రమని చెప్పింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో తెరకెక్కనుందని వెల్లడించింది. ఈ సినిమా జూన్ లో సెట్స్ పైకి వెళ్లనుందని శాంతిప్రియ తెలిపింది. సరోజిని నాయుడులా కనిపించేందుకు తాను చాలా కసరత్తులు చేయాల్సి ఉందని పేర్కొంది. 

కాగా, శాంతిప్రియ జాతీయ స్థాయిలో టెలివిజన్ నటిగానూ గుర్తింపు పొందింది. అప్పట్లో దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన విశ్వామిత్ర సీరియల్లో శకుంతల పాత్ర పోషించి అన్ని భాషల వీక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత ఆర్యమాన్... బ్రహ్మానంద్ కో యోధ, మాతా కి చౌకి, ద్వారకాధీశ్ వంటి సీరియళ్లలో కనిపించింది.

More Telugu News