Kodandaram: కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం వేళ.. తెలంగాణకు ద‌క్కాల్సిన నీటి వాటా ఇవ్వాల‌ని కోదండ‌రాం డిమాండ్

  • ఆర్డీఎస్ 15.9 టీఎంసీలు రావాల్సి ఉందన్న కోదండ‌రాం
  • అందులో సగం కూడా రావడం లేద‌ని విమ‌ర్శ‌
  • పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ పూర్తి చేయాలని డిమాండ్
Kodandaram slams kmrb

హైదరాబాద్ లో నేడు కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. ఈ స‌మావేశానికి తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరుకానున్నారు. ఇందులో ప్ర‌ధానంగా శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో 15 ఔట్‌లెట్లను బోర్డ్‌కు అప్పగించడంపై చ‌ర్చించనున్న‌ట్లు తెలుస్తోంది. నీటి వాటాతో పాటు నిధుల కేటాయింపు, తదితర అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. 

ఈ నేప‌థ్యంలో న‌ల్ల‌గొండ జిల్లా నార్కట్ పల్లిలో టీజేఎస్ అధ్య‌క్షుడు కోదండ‌రాం మీడియాతో మాట్లాడుతూ... శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఉన్న 15 ఔట్ లెట్స్ కావాలని బోర్డు అధికారులు అడుగుతున్నారని చెప్పారు. అయితే, ఆర్డీఎస్ 15.9 టీఎంసీలు రావాల్సి ఉందని, అందులో సగం కూడా రావడం లేదని తెలిపారు. అలాగే, తెలంగాణకు 811 టీఎంసీలకు 299 టీఎంసీలు మాత్ర‌మే తాత్కాలికంగా కేటాయిస్తున్నార‌ని చెప్పారు. 

నేటి సమావేశంలో తెలంగాణకు న్యాయమైన వాటా ఇవ్వాలని, అలాగే, కృష్ణా నది కింద పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ఆయ‌న అన్నారు. మ‌రోవైపు, తెలంగాణలో అకాల వ‌ర్షాల‌కు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని ఆయ‌న రాష్ట్ర స‌ర్కారుని డిమాండ్ చేశారు.

More Telugu News