Teenmar Mallanna: ఒట్టేసి చెబుతున్నా.. ఇక నుంచి కేసీఆర్‌ను తిట్టను గాక తిట్టను: తీన్మార్ మల్లన్న

  • గజ్వేలులో ‘7200 మూవ్‌మెంట్’ సన్నాహక సభ
  • కేసీఆర్‌పై విమర్శలు చేయడం తన విధానం కాదన్న మల్లన్న
  • వందల కోట్లు ఖర్చు చేసి యాదాద్రిలో చేసిన అభివృద్ధి ఒక్క గాలివానకే పోయిందని ఎద్దేవా
  • రైతులు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ విడిచి రావడం లేదన్న మల్లన్న 
from now will not scold KCR Says Teenmar Mallanna

వీలు చిక్కితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడే తీన్మార్ మల్లన్న శపథం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిన్న నిర్వహించిన '7200 మూవ్‌మెంట్' సన్నాహక సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఇకపై కేసీఆర్‌ను తిట్టబోనని ఒట్టేసి చెబుతున్నానని అన్నారు. అయితే, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దోపిడీ రాజ్యం పోయే వరకు మాత్రం తన '7200 మూవ్‌మెంట్' ద్వారా పోరాడతానని స్పష్టం చేశారు. 

ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడమే తన విధానం కాదన్న ఆయన.. గొప్పోళ్ల, పేదోళ్ల బిడ్డలు ఒకే పాఠశాలలో చదవాలన్నదే తన ఉద్యమ లక్ష్యమని అన్నారు. విద్యావంతులైన బాల్క సుమన్, గాదరి కిషోర్‌లకు విద్యాశాఖ అప్పగిస్తే బాగుంటుందని మల్లన్న అభిప్రాయపడ్డారు. యాదాద్రిలో వందల కోట్ల రూపాయలు వెచ్చించి చేసిన అభివృద్ధి ఒక్క గాలి వానకే తుడిచిపెట్టుకుపోయిందని ఎద్దేవా చేశారు. 

అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ మాత్రం ఫామ్‌ హౌస్‌ను విడిచి బయటకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, తమ ఆస్తులను ప్రభుత్వానికి రాసి ఇచ్చేసి జూన్ రెండో వారం నుంచి చేపట్టనున్న ప్రజాపాదయాత్రలో పాల్గొంటామని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు.

More Telugu News