Etela Rajender: తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్నారు: ఈటల రాజేందర్

  • రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్నారు
  • ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తే గెలుస్తాడు
  • కాంగ్రెస్ కు ఓటు వేస్తే టీఆర్ఎస్ కు వేసినట్టే
People are hating KCR says Etela Rajender

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ ను అసహ్యించుకుంటున్న వారు ఎంతమంది ఉన్నారో నా కంటే మీకే ఎక్కువ తెలుసని బీజేపీ శ్రేణులను ఉద్దేశించి చెప్పారు. 

తాండూరులో నిర్వహించిన బీజేపీ శిక్షణా తరగతుల కార్యక్రమానికి ఈటల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం, డబ్బులు కురిపించినా గెలవలేరని... ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తే విజయం సాధిస్తాడని చెప్పారు. ఆత్మగౌరవం, ధర్మానికి మాత్రమే ప్రజల గుండెల్లో చోటు ఉంటుందని అన్నారు. 

రైతుబంధు పథకాన్ని కేవలం పేద రైతులకు మాత్రమే ఇవ్వాలని ఈటల డిమాండ్ చేశారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలంటే రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరాల్సిందేనని చెప్పారు. సెల్ ఫోన్ అనేది ఇప్పుడు ఒక శక్తిమంతమైన ఆయుధంగా మారిందని... దాని ద్వారా ప్రజలకు మంచి చేసే సందేశాలను పంపించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే టీఆర్ఎస్ కు వేసినట్టేనని చెప్పారు.

More Telugu News