Smriti Irani: రాహుల్ గాంధీ అడ్డాలో.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పర్యటన

  • కేరళలోని వయనాడ్ కు స్మృతి ఇరానీ
  • అభివృద్ధి ప్రాజెక్టులపై సమీక్ష
  • గిరిజన నేతలతో భేటీ
  • మంత్రి పర్యటనతో కొత్త ఊహాగానాలు
Smriti Irani visit Kerala Wayanad before 2024 election

కాంగ్రెస్ కంచుకోట అమేథీలో రాహుల్ గాంధీని గతంలో ఓడించిన కేంద్ర మంత్రి, స్మృతి ఇరానీ.. కేరళలో రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నేడు పర్యటిస్తున్నారు. అభివృద్ది ప్రాజెక్టులను మంత్రి సమీక్షించనున్నారు. 

‘‘హలో వయనాడ్! జిల్లా అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు, సమావేశాల్లో నేను పాల్గొనబోతున్నాను. రేపు మిమ్మల్ని చూస్తాను’’అంటూ మంత్రి స్మృతి ఇరానీ సోమవారం సాయంత్రం ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. అది కూడా మలయాళంలో. రోజంతా పలు కార్యక్రమాల్లో ఆమె బిజీగా గడపనున్నారు. కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధుల మద్దతుతో నడుస్తున్న కార్యక్రమాలు, ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకోనున్నారు. ప్రజలు, గిరిజన నేతలను కలుసుకోనున్నారు.

2019 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని అమేథీ లోక్ సభ స్థానంలో రాహుల్ పై పోటీ చేసిన స్మృతి ఇరానీ 55 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం తెలిసిందే. అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి కూడా రాహుల్ పోటీ చేశారు. అమేథీలో ఓడి, వయనాడ్ లో మాత్రం విజయం సొంతం చేసుకున్నారు. ఇప్పుడు వయనాడ్ లో మంత్రి ఇరానీ పర్యటిస్తుండడం కొత్త ఊహాగానాలకు తెరలేపింది. రానున్న 2024 ఎన్నికల్లో వయనాడ్ నుంచి రాహుల్ పై స్మృతి ఇరానీ పోటీకి దిగుతారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

More Telugu News