Telangana: తెల్లారితే పెళ్లి.. యువకుడి వేధింపులు తాళలేక యువతి బలవన్మరణం!

  • నారాయణపేట జిల్లా మక్తల్‌ పరిధిలో ఘటన
  • నిశ్చితార్థమైందని తెలిసినా ఆగని వేధింపులు
  • భరించలేకే చనిపోతున్నానని సూసైడ్ నోట్
  • పరారీలో నిందితుడు
Young Girl Committed Suicide after a young boy harassment in the name of love

తెల్లారితే పెళ్లిపీటలు ఎక్కాల్సిన అమ్మాయి.. ఓ యువకుడి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. మక్తల్ పరిధిలోని చందాపూర్‌కు చెందిన పద్మమ్మ-వెంకటయ్య దంపతుల రెండో కుమార్తె భీమేశ్వరి (19)కి దండు గ్రామానికి చెందిన యువకుడితో పది రోజుల క్రితం వివాహ నిశ్చితార్థం జరిగింది. నేడు ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. ఇరు కుటుంబాల వారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. అంతలోనే నిన్న తెల్లవారుజామున భీమేశ్వరి ఇంట్లోనే చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

గమనించిన కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. తనకు నిశ్చితార్థమైన విషయం తెలిసినా చందాపూర్‌కే చెందిన లిక్కి అలియాస్ సిరిపి నర్సింహులు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని, అతడి వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాసిన సూసైడ్ నోట్ ఆమె వద్ద లభించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు లిక్కి పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

More Telugu News