Tadepalli: తాడేపల్లిలో వృద్ధుడిపై దౌర్జన్యం... సాక్షి గూండాల బరితెగింపు అంటూ చంద్రబాబు, లోకేశ్ ఆగ్రహం

  • తాడేప‌ల్లిలో ఘటన
  • వృద్ధుడిపై దాడికి పాల్ప‌డ్డ‌ నాగిరెడ్డి
  • అతడు సాక్షి విలేకరి అని వెల్లడించిన చంద్రబాబు
  • వీడియోను పోస్ట్ చేసిన వైనం
Chandrababu and Lokesh slams Sakshi media person

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నివాసానికి కూత‌వేటు దూరంలో తాడేప‌ల్లి ప‌రిధిలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌పై టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఓ వృద్ధుడిపై నాగిరెడ్డి అనే వ్యక్తి దౌర్జ‌న్యానికి పాల్పడ్డాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను చంద్ర‌బాబుతో పాటు నారా లోకేశ్ కూడా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. 

ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన చంద్ర‌బాబు.. "ఇదిగో సాక్షి గూండాల బరితెగింపు....! అది కూడా స్వయంగా... సాక్షి యజమాని సీఎం నివశించే తాడేపల్లిలో! ప్రైవేటు వివాదంలో వేలు పెట్టి... వృద్ధుడు, మహిళలపై దాడి. అధికార మదంతో పెట్రేగుతున్న ఇలాంటి మీడియా ముసుగు అరాచకాలను కట్టడి చేయలేరా?" అంటూ ప్ర‌శ్నించారు. 

ఇదే ఘ‌ట‌న‌పై నారా లోకేశ్ కూడా తీవ్రంగా స్పందించారు. "యధా సాక్షి యజమాని, తథా సాక్షి ఉద్యోగులు. వైసీపీ నాయకులు భూ కబ్జాలు, దాడులు, హత్యలతో రెచ్చిపోతుంటే మేమేమైనా తక్కువ తిన్నామా అంటున్నారు సాక్షి సిబ్బంది. మంగళగిరి నియోజకవర్గంలో సాక్షి రిపోర్టర్ నాగిరెడ్డి దాష్టీకం చూస్తుంటే... ఇక ఈ రాష్ట్రంలో సామాన్యులు బ్రతికే పరిస్థితి లేదని అర్థమవుతుంది. ప్రైవేట్ భూ వివాదంలో జోక్యం చేసుకోవడమే తప్పు అయితే... చంపొద్దంటూ కాళ్ళు పట్టుకొని ఆ స్థలయజమాని అయిన వృద్ధుడు ప్రాధేయపడినా వదలకుండా దాడికి పాల్పడటం దారుణం. అడ్డొచ్చిన మహిళను కాలితో తన్నిన సాక్షి విలేకరి నాగిరెడ్డి అరాచకాలకి అడ్డే లేకుండా పోతోంది" అని లోకేశ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

More Telugu News